లడ్డూ ‘సిట్’ దర్యాప్తు వేగవంతం!
Published on: Tue Oct 1, 2024 1:12PM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వినియోగం ఆరోపణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు వేగం పెంచింది. గత మూడు రోజులుగా తిరుమలలో బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం పిండిమరతో పాటు ల్యాబ్లో తనిఖీలు నిర్వహించారు. అలాగే తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకులను నిల్వ చేసే గోదాములను పరిశీలించారు. గోడౌన్లలో నిల్వఉంచిన ముడిసరుకుల నాణ్యతను పరిశీలించారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిసరుకును ఎలా భద్రపరుస్తారు., వాటికి సంబంధించిన రికార్డులను ఎలా మెయిన్టేన్ చేస్తారు.. అనే అంశాలపై ఆరా తీశారు. ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతను తిరుమలలో పరీక్షించేందుకు మెషీన్లు ఉన్నాయా, ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారన్న వివరాలూ తెలుసుకున్నారు.


