TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు.. జగన్ పీఏను విచారించిన సిట్

Published on: Fri May 29, 2026 10:50AM

ఆంధ్రప్రదేశ్  మద్యం కుంభకోణం  కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం  తాజాగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్  వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కె. నాగేశ్వర రెడ్డిని   విచారించింది. సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఆయన విచారణాధికారుల ఎదుట హాజరయ్యారు.

ఈ దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు నాగేశ్వరరెడ్డిని వరుసగా రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..  విచారణలో ఆయన అధికారుల ప్రశ్నలకు దాటవేత ధోరణి అవలంబించారనీ, ఈ వ్యవహారానికి సంబంధించిన పలు కీలక కార్యాచరణలపై తనకు ఎటువంటి అవగాహన లేదని తెలిపినట్లు సమాచారం. అంతే కాకుండా, ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అధికారులు లేదా ఇతర రాజకీయ నేతలతో తనకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 

విచారణ సందర్భంగా నాగేశ్వర రెడ్డి తన పాత్రను సమర్థించుకుంటూ.. మాజీ సీఎం  జగన్ అధికారిక షెడ్యూల్స్, కార్యక్రమాలను నిర్వహించడానికే తన బాధ్యతలు పరిమితమని చెప్పినట్లు తెలుస్తోంది. ఇతర పరిపాలనా పరమైన,  ఆర్థిక లావాదేవీల వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కే నాగేశ్వరరెడ్డి సిట్ విచారణలో చెప్పారు.  తొలి రోజు విచారణకు నాగేశ్వరరెడ్డి సహకరించకపోవడంతో..  ఆయనను రెండో రోజు కూడా విచారించడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.  జగన్ పీఏను మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు విచారించడంతో.. ముందు ముందు ఇంకా ఎవరెవరిని ఈ కేసులో సిట్ విచారణకు పిలుస్తుందా? అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.