TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోద‌రి అస్తిపంజ‌ర‌మే డెత్ స‌ర్టిఫికేట్!

Published on: Wed Apr 29, 2026 11:12AM

ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన అత్యంత బాధాకరమైనది. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ఆ గిరిజన సోదరుడిది కేవ‌లం కథ కాదు. ఒక‌ దీన గాథ‌. కన్నీటి ఉప్పెన. కియోంఝర్ జిల్లా, పతానా బ్లాక్‌లోని దియనాలి గ్రామానికి చెందిన జీతూ ముండా అనే 50 ఏళ్ల‌ వ్యక్తి తన సోదరి అస్తిపంజరాన్ని సంచిలో వేసుకుని బ్యాంకుకు వెళ్లాడు. అలా ఎందుకు చేయాల్సి వ‌చ్చిందో చూస్తే..

జీతూ ముండా సోదరి యాభై ఆరేళ్ల‌ కల్రా ముండా  ఈ ఏడాది జనవరి 26న మరణించారు. ఆమె పేరు మీద ఒడిశా గ్రామీణ బ్యాంక్, మాలిపాసి శాఖలో రూ.19,300 వరకు డ‌బ్బులున్నాయి. ఆ డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి జీతూ చాలాసార్లు బ్యాంకు చుట్టూ తిరిగాడు. అయితే, నామినీగా ఉన్న వ్యక్తి కూడా అప్పటికే మరణించడంతో బ్యాంకు అధికారులు నిబంధనల ప్రకారం డెత్ సర్టిఫికేట్  లేదా  లీగల్ హెయిర్ అంటే, వారసత్వ ధృవీకరణ పత్రం అడిగారు.

బ్యాంకు అధికారులు తన సోదరి చనిపోయిందని నమ్మడం లేదనీ.. ఆమెను స్వయంగా తీసుకురావాలని అన్నారని అంటాడు జీతూ. అమాయకత్వం, చదువు లేకపోవడం, బ్యాంకు నిబంధనల పట్ల త‌గిన‌ అవగాహన లేకపోవడంతో.. తన సోదరి చనిపోయిందని నిరూపించడానికి ఆమె సమాధిని తవ్వి, అందులోని అస్తిపంజరాన్ని సంచిలో వేసుకుని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకుకు కాలినడకన చేరుకున్నాడు జీతూ. జీతూ అలా చేయ‌డంతో  బ్యాంకు సిబ్బంది, అక్క‌డున్న‌ ఖాతాదారులు ఒక్కసారిగా  ఉలిక్కిప‌డ్డారు. వెంట‌నే బ్యాంక్ స్టాఫ్ పోలీసుల‌కు స‌మాచార‌మందించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జీతూ ముండాకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టపరమైన ప్రక్రియల గురించి వివరించారు.  ఆ అస్థికలను తిరిగి మర్యాదపూర్వకంగా ఖననం చేయించారు.  ప్రస్తుతం స్థానిక అధికారులు ఆ గిరిజనుడికి అవసరమైన లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇతర పత్రాలు ఇప్పించి, బ్యాంకులో ఉన్న నగదు అతనికి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఈ ఘటన కేవలం ఒక వ్యక్తి అమాయకత్వం మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నిబంధనల పట్ల అవగాహన లోపానికి, అధికార యంత్రాంగం మొండితనానికి అద్దం పడుతోంది. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన సర్టిఫికెట్లు పొందే ప్రక్రియ గిరిజనులకు ఎంత భారంగా మారుతుందో ఈ ఘటన ద్వారా అర్థమవుతోంది. ఒక సోదరుడు తన సోదరి మరణాన్ని నిరూపించుకోవడానికి ఇంతటి సాహసం చేయాల్సి రావడం నిజంగా హృదయ విదారకంగా భావిస్తున్నారు.