కాటన్ ని పొగుడుతూ జగన్ కి చురక
posted on May 15, 2020 3:24PM
ధవళేశ్వరం ప్రాజెక్టు రూపకర్త సర్ ఆర్థర్ కాటన్ జయంతిని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఓ వైపు కాటన్ గొప్పతనాన్ని ప్రశంసిస్తూనే, మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగట్లేదు అంటూ జగన్ సర్కార్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
"ఒక వ్యక్తి తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో కాటన్ మహశయుడు రుజువు చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ఏమాత్రం అందుబాటులో లేని రోజుల్లో రెండు జిల్లాల పరిధిలో ఆనకట్టను, కాలువల వ్యవస్థలను కేవలం అయిదేళ్ల వ్యవధిలో పూర్తిచేసిన కాటన్ సంకల్పం మాటలకు అందనిది." అని ప్రశంసిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
"నీటితో ప్రజల తలరాతలను మార్చవచ్చని నిరూపించిన కాటన్ మహానుభావుని స్ఫూర్తితోనే పోలవరం పూర్తికి సంకల్పించి, 70 శాతం పని పూర్తిచేయగలిగింది తెలుగుదేశం. అటువంటి ప్రాజెక్టు ఈ రోజు పడకేయడం బాధాకరం. కాటన్ జయంతి సందర్భంగా ఆ నిస్వార్థ ప్రజాసేవకుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను." అంటూ మరో ట్వీట్ చేశారు.