TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీ వెళ్లే ప్రసక్తే లేదు...రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటా : సిద్ధరామయ్య

Published on: Thu May 28, 2026 5:12PM

 

కర్ణాటక రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత కొద్ది రోజులుగా అక్కడ ముఖ్యమంత్రి మార్పుపై జోరుగా ప్రచారం సాగుతున్న తరుణంలో, కాంగ్రెస్ అధిష్టానం ఒక కీలక వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. సీఎం సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి పంపి, ఆ స్థానంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు పగ్గాలు అప్పగించాలని భావించింది. అందులో భాగంగానే సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటును ఆఫర్ చేయగా, ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ ముఖ్య నేతలు సిద్ధరామయ్యతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో నాయకత్వ మార్పు అనివార్యమని అధిష్టానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. గతంలో కుదిరిన అధికార భాగస్వామ్య ఒప్పందం ప్రకారం సగం పదవీకాలం ముగిసినందున, డీకే శివకుమార్‌కు సీఎం పదవి అప్పగించేందుకు వీలుగా సిద్ధరామయ్యను కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలకం చేయాలని పెద్దలు ప్రతిపాదించారు.  అయితే, అధిష్టానం ప్రతిపాదించిన ఈ రాజ్యసభ ఆఫర్‌ పట్ల సిద్ధరామయ్య ఏమాత్రం ఆసక్తి చూపలేదని సమాచారం. 

తాను కర్ణాటక రాజకీయాల్లోనే కొనసాగుతానని, కేవలం ఎమ్మెల్యేగా ఉంటూ రాష్ట్ర ప్రజల సేవకే పరిమితమవడానికి సిద్ధమే తప్ప, ఢిల్లీకి వెళ్లే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ తాను రాజ్యసభకు వెళ్తే, కర్ణాటకలో తదుపరి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై ఆయన వరిష్టుల ముందే కొన్ని ప్రశ్నలు లేవనెత్తినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై పట్టున్న సిద్ధరామయ్యకు అటు వెనుకబడిన వర్గాల్లో (అహిందా కూటమి) భారీగా ప్రజాదరణ ఉంది. ఆయనను కాదని హఠాత్తుగా పదవి నుంచి తప్పించడం పార్టీకి నష్టం చేస్తుందనే ఆందోళన కూడా ఒక వర్గం నేతల్లో ఉంది. 

ఈ నేపథ్యంలోనే ఆయనకు గౌరవప్రదమైన స్థానం కల్పించి, ఢిల్లీకి తీసుకురావాలని అధిష్టానం వేసిన ప్లాన్‌కు సిద్ధరామయ్య 'నో' చెప్పడంతో హైకమాండ్ పునరాలోచనలో పడింది. మరోవైపు, అధికారికంగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తోంది. కేవలం రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, స్థానిక శాసనమండలి స్థానాల గురించే చర్చలు జరిగాయని, నాయకత్వ మార్పు అనేది కేవలం మీడియా సృష్టి అని ఏఐసీసీ వర్గాలు ప్రకటిస్తున్నాయి. 

అయినప్పటికీ సిద్ధరామయ్య తన ఆత్మీయులతో జరిపిన అంతర్గత సమావేశాలు చూస్తుంటే రాష్ట్రంలో ఏదో పెద్ద మార్పు జరగబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఈ హైడ్రామాపై అటు ప్రతిపక్షాలు కూడా నిఘా ఉంచాయి. సిద్ధరామయ్య తన నిర్ణయంపై పట్టుదలతో ఉంటారా? లేక అధిష్టానం ఒత్తిడికి తలొగ్గి రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అన్నది రాబోయే కొద్ది రోజుల్లో తేలనుంది. జూన్ మొదటి వారంలో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగియనుండటంతో, అంతకంటే ముందే కర్ణాటక కాంగ్రెస్‌ సంక్షోభానికి ఒక స్పష్టమైన ముగింపు వచ్చే అవకాశం ఉంది.