ఓ కుక్క చనిపోతే మోదీ సమాధానం చెప్పాలా?

ఈ మధ్య కొందరు నేతల నోటికి అద్దు అదుపు లేకుండా పోతుంది.. నోటికి ఎంతమాట వస్తే అంత మాట అనేస్తున్నారు.. ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ హత్య కేసు విషయంలో ఇలాంటి సంఘటనే జరిగింది.. ఓ వైపు గౌరీ లంకేష్ ను హత్య చేసిన పరశురామ్‌కు, శ్రీరామ్ సేనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తుండగా.. మరో వైపు శ్రీరామ్ సేన చీప్ ప్రమోద్ ముథాలిక్, గౌరీ లంకేష్ ను కుక్కతో పోలుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.. కాంగ్రెస్ హయాంలో కర్ణాటకలో రెండు, మహారాష్ట్రలో రెండు హత్యలు జరిగాయి.

అప్పుడు కాంగ్రెస్ వైఫల్యంపై ఒక్కరు కూడా ప్రశ్నించలేదు కానీ ఇప్పుడు గౌరీ లంకేష్ హత్య విషయంలో మోడీ మౌనంగా ఉన్నారంటూ నిలదీస్తున్నారు.. కర్ణాటకలో ఓ కుక్క చనిపోతే మోడీ సమాధానం చెప్పాలా? అంటూ ప్రమోద్ ముథాలిక్ వ్యాఖ్యలు చేసారు.. ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో.. 'నేను గౌరీ లంకేష్ ను కుక్కతో పోల్చలేదు, కర్ణాటకలో జరిగే ప్రతి హత్యకు మోడీ స్పందించాల్సిన అవసరంలేదని చెప్పడమే నా ఉద్దేశం' అంటూ ప్రమోద్ ముథాలిక్ తన మాటల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసారు.