రాహుల్, ప్రియాంకలను ప్రశంసించిన శివసేన.. వారి శ్రమకు ఫలితంగా?

 

ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని శివసేన ధీమా వ్యక్యం చేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకగాంధీలపై ప్రశంసలు కురిపించింది. ఎన్నికల్లో రాహుల్, ప్రియాంకలు చాలా కష్టపడ్డారని.. వారి శ్రమకు ఫలితంగా సభలో కాంగ్రెస్‌ బలమైన ప్రతిపక్షపార్టీగా నిలవబోతోందని శివసేన పార్టీ అభిప్రాయపడింది. ఈ మేరకు మంగళవారం శివసేన అధికార పత్రిక సామ్నాలో ఓ కథనాన్ని ప్రచురించారు.

మోదీ మరోసారి ప్రధాని అవుతారని చెప్పడానికి రాజకీయ పండితులు అవసరం లేదని.. ప్రజల్లో ఉత్సాహమే తమ గెలుపుకు సంకేతమని వ్యాఖ్యానించింది. మోదీని మళ్లీ ప్రధానిని చేయాలనే నిర్ణయానికి ప్రజలు ఎప్పుడో వచ్చేశారని తెలిపింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లతో పాటు.. మమతాబెనర్జీ రాష్ట్రమైన పశ్చిమబెంగాల్ లో కూడా బీజేపీకి క్లియర్ మెజార్టీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయని చెప్పింది. మహారాష్ట్ర ప్రజల మద్దతు ప్రధాని మోదీకే ఉందన్న విషయం ఇప్పటికే స్పష్టమైందని.. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి చరిత్రాత్మక విజయం సాధిస్తుందని తెలిపింది.