అసేంబ్లీకి తెలంగాణ నోట్: షిండే
posted on Oct 11, 2013 10:46AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసేంబ్లీకి తెలంగాణ నోట్ ను త్వరలోనే పంపనున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. నెల వారీ సమీక్ష నివేదిక వెల్లడించడంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ అంశం గురించి మాట్లాడారు. కేబినెట్ నోట్ ముందుగా అసేంబ్లీకి వెళ్లదని, కేంద్ర మంత్రుల బృందం నివేదిక వచ్చిన తరవాత దానిని ఆమోదించి రాష్ట్రపతికి పంపుతుందని తెలిపారు.
ఆ నివేదికను రాష్ట్రపతి అసేంబ్లీకి పంపుతారని, అసేంబ్లీ నుండి నోట్ పార్లమెంట్ కు వస్తుందని తెలిపారు. వీలయినంత తొందరగా తెలంగాణ తీర్మానం అసేంబ్లీకి వస్తుందని షిండే అన్నారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ అందరితో చర్చించిందని, మంత్రుల బృందం ఇప్పుడు ఎవరెవరితో చర్చిస్తుంది, ఎవరెవరిని కలుస్తుంది అన్నది చెప్పలేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, అవసరమయిన చర్యలు తీసుకుంటామని అన్నారు.