రాజీనామా చేస్తా... షీలా దీక్షిత్
posted on Aug 26, 2014 12:39PM
కేరళ గవర్నర్ పదవి నుంచి వైదొలగడానికి బెట్టు చేస్తూ వస్తున్న షీలాదీక్షిత్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. షీలా దీక్షిత్ సోమవారం నాడు ఢిల్లీకి వచ్చి మొదట కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ని, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఎన్డీయే ప్రభుత్వం ఆమెని పదవి నుంచి వైదొలగాల్సిందిగా మౌఖికంగా ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆమె హోం మంత్రిని, రాష్ట్రపతిని కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. షీలా దీక్షిత్ ఢిల్లీ టూర్ ఆంతర్యం ఏమిటా అన్న ఆలోచనలో రాజకీయ వర్గాలు పడ్డాయి. చివరికి షీలాదీక్షిత్ కేరళ గవర్నర్ పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించారన్న విషయం బయటపడింది. ఇక గంటల్లోనే ఆమె రాజీనామా వార్త వెలువడే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.