TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నీట్ నిరసనల వేళ శశి థరూర్ రీపోస్ట్.. బాలీవుడ్ మౌనంపై ఊపందుకున్న చర్చ!

Published on: Thu Jul 23, 2026 9:33AM

దేశవ్యాప్తంగా నీట్  లీకేజీ వ్యవహారం దుమారం రేపుతున్న వేళ.. తమ న్యాయమైన హక్కుల కోసం, భవిష్యత్తు రక్షణ కోసం ఢిల్లీ వీధుల్లో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, నిర్బంధం వంటి అణచివేత చర్యలకు పాల్పడటం వివాదానికి దారితీసింది. రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు పోలీసు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,  ఎంపీ శశి థరూర్  సామాజిక మాధ్యమం  వేదికగా చేసిన  రీపోస్ట్ ఇప్పుడు  చర్చనీయాంశంగా మారింది.

శశి థరూర్ తన  ఎక్స్  ఖాతాలో ఎలాంటి అదనపు వ్యాఖ్యలు జోడించకుండా..  2012లో   బాలీవుడ్ దిగ్గజ నటుడ, బిగ్ బి  అమితాబ్ బచ్చన్ చేసిన   ట్వీట్ ను రీట్వీట్ చేశారు.  2012 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన  సామూహిక అత్యాచార ఘటనకు నిరసనగా ఇండియా గేట్, రైసినా హిల్ వద్ద ప్రజలు, యువత ఆందోళన చేపట్టిన సమయంలో ఆందోళనకారులపై పోలీసులు   భాష్పవాయు  ప్రయోగం, వాటర్ క్యానన్ల చర్యలపై బిగ్ బీ ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే   బాధగా,దిగ్భ్రాంతిగా ఉంది.. శాంతియుతంగా జరుగుతున్న నిరసనలపై భాష్పవాయు గోళాలు, వాటర్ క్యానన్లను ఉపయోగిస్తున్నారు  అంటూ  అమితాబ్ బచ్చన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.  

ఇప్పుడు శశిథరూర్ అప్పట్లో  అమితాబ్ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. శశిథరూర్ చర్య వెనుక స్పష్టమైన  సందేశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2012లో ప్రభుత్వ చర్యలను నిలదీస్తూ గళమెత్తిన బాలీవుడ్ అగ్ర నటులు, ఈ రోజు నీట్ విద్యార్థులపై పోలీసుల దమనకాండ విషయంలో మౌనంగా ఉండటాన్ని శశిథరూర్ నాటి అమితాబ్ ట్వీట్ ను తిరిగి పోస్టు చేయడం ద్వారా నిలదీసి, నిగ్గదీసి ప్రశ్నించారని అంటున్నారు.  బాలీవుడ్ అగ్రనటుల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారని చెబుతున్నారు. 

అయితే నీట్ లీకేజీకి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలపై  బాలీవుడ్ పరిశ్రమ మొత్తం మౌనంగా అయితే లేదు.  కొద్దిమంది సినీ ప్రముఖులు  విద్యార్థుల పక్షాన నిలబడ్డారు.  శబానా అజ్మీ, ప్రకాష్ రాజ్, స్వర భాస్కర్ వంటి వారు స్వయంగా  జంతర్ మంతర్ వద్దకు వెళ్లి మరీ విద్యార్థులకూ, వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. అలాగే..  హుమా ఖురేషి, నసీరుద్దీన్ షా, సోనాక్షి సిన్హా, అభయ్ డియోల్ వంటి వారు సామాజిక మాధ్యమం వేదికగా  విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.   ప్రీతి జింటా, భూమి పెడ్నేకర్ వంటి నటీమణులు హింసకు తావులేకుండా, విద్యార్థుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంపైనే పాలకులు దృష్టి పెట్టాలని బహిరంగంగా కేంద్రానికి విజ్ణప్తి చేశారు. 

అయితే ఇక్కడ శశిథరూర్  పోస్టు .. గతంలో సామాజిక అంశాలపై గళమెత్తిన బాలీవుడ్ పెద్దలు నేడు ఎందుకు సైలంటైపోయారన్న చర్చను లేవనెత్తింది. 2012 నాటి అమితాబ్ స్పందన, ప్రస్తుత నీట్ నిరసనలపై అమితాబ్ వంటి  అగ్ర తారల మౌనం వెనుక ఉన్న కారణమేంటన్న చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. 

Shashi Tharoor repost, NEET protests Delhi, Amitabh Bachchan 2012 tweet, Bollywood silence on NEET, NEET paper leak news, Jantar Mantar protests