షర్మిలపై దుష్ప్రచారం దారుణం: మహిళా ఎంపీలు

 

వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైకాపా అధ్యక్షుడు జగన్ సోదరి అయిన షర్మిల మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ అప్రతిష్టపాలు చేసేందుకు యత్నించడం దారుణమని వైసీపీ మహిళా ఎంపీలు సంబంధీకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీలు కొత్తపల్లి గీత (అరకు), బుట్టా రేణుక (కర్నూలు) మీడియాతో తమ ఆవేదనని, ఆగ్రహాన్ని వ్వక్తం చేశారు. రాజకీయాల్లో ఎదుగుతున్న ఒక మహిళా నాయకురాలిపై సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. షర్మిలను సోషల్ మీడియాలో అవమానించడం వెనుక రాజకీయ హస్తం వుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసం షర్మిలపై అభూత కల్పనలు సృష్టించి ప్రచారం చేయడమనేది దిగజారుడు చర్య అని వారు విమర్శించారు. కొందరు వ్యక్తులు, వెబ్‌సైట్లు షర్మిలపై తప్పుడు ప్రచారం చేయడాన్ని సమాజంలో మనసున్న ప్రతి మహిళా ప్రతిఘటించాలని, తనపై జరుగుతున్న దుష్ర్పచారంపై ఆమె చేస్తున్న పోరాటంలో తాము వెంట నిలుస్తామని వైకాపా మహిళా ఎంపీలు చెప్పారు.