వైఎస్ జగన్ మద్దతు కోరిన కాంగ్రెస్
posted on May 21, 2019 11:43AM
మోదీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి కేంద్రంలో అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ.. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాదని కాంగ్రెస్ భావిస్తోంది. హంగ్ తప్పదని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు ఎన్డీయేలో లేని ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే.. ఏపీలో మెజారిటీ ఎంపీ సీట్లు వైసీపీకి దక్కుతాయన్న జాతీయ చానెళ్ల ఎగ్జిట్పోల్స్ అంచనాల నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ని కూడా ఎన్డీయేతర కూటమిలోకి లాగే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జగన్కు ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ఫోన్ చేసి ఎన్డీయేతర కూటమికి మద్దతివ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతివ్వాల్సిందిగా జగన్ను కోరినట్లు సమాచారం. అయితే, ఏ విషయమైనా ఫలితాలు వచ్చిన తర్వాతే చెబుతానని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.