TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

షాబాద్ ఆరు హత్యల కేసుపై హరీష్ రావు షాకింగ్ కామెంట్స్..!

Published on: Mon Jul 13, 2026 4:09PM

 

షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ను ముందుగానే అరెస్ట్ చేసి ఉంటే ఆరుగురు అమాయకుల ప్రాణాలు కాపాడేవారని ఆయన అన్నారు. సిద్దిపేట మీటింగ్ లో హరీష్ రావు మాట్లాడుతూ.. రాజ్‌కుమార్‌పై ఇప్పటికే పోక్సో కేసు నమోదైందని, అయినప్పటికీ అతడిని అరెస్ట్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా వదిలేశారని ఆరోపించారు. 

రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ రూ.20 లక్షలు లంచం తీసుకుని రాజ్‌కుమార్‌ను అరెస్ట్ కాకుండా కాపాడాడని ఆయన ఆరోపించారు. పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోకుండా సుమారు 45 రోజుల పాటు నిందితుడిని స్వేచ్ఛగా తిరిగేలా చేశారని, ఆ సమయంలో అతడు కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందాడని హరీష్ రావు అన్నారు. అనంతరం అదే వ్యక్తి ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేశాడని ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యమే కారణమని ఆయన విమర్శించారు.ఇంకా, సోషల్ మీడియా పోస్టులు చేసిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారని, కానీ పోక్సో కేసులో నిందితుడైన రాజ్‌కుమార్ విషయంలో మాత్రం అదే వేగం కనిపించలేదని హరీష్ రావు విమర్శించారు. 

ఏపీలో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను, నల్లబాలు అనే వ్యక్తిని సోషల్ మీడియా పోస్టుల కారణంగా అరెస్ట్ చేశారని, కానీ రాజ్‌కుమార్‌ను మాత్రం అరెస్ట్ చేయకుండా అతనితో పోలీసులు కూర్చొని మద్యం సేవించారని కూడా ఆయన ఆరోపించారు. షాబాద్‌లో జరిగిన ఈ ఆరు హత్యల ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి విచారణ జరిపి, నిందితుడికి సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.