బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు.!
Published on: Fri Jul 31, 2026 2:38PM
మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గానికి చెందిన రేగా కాంతారావుపై హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తీఈ కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగికంగా వేధించడమే కాకుండా ఆర్థికంగానూ మోసం చేశారంటూ ఒక యువతి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆయనపై కేసు నమోదై విచారణ మొదలైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెడితే.. మీడియాలో పని చేస్తూ.. హైదరాబాద్లోని ఒక పీజీ హాస్టల్లో ఉంటున్న ఒక యువతికి, 2022లో ఒక ఇంటర్వ్యూ నిమిత్తం రేగా కాంతారావుతో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో కొత్తగా ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్మాణం చేపడదామంటూ ఆ యువతితో రేగా కాంతారావు పరిచయం పెంచుకున్నారు. ఆ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారింది. నెపంతో మొదలైన ఈ పరిచయం, రానురాను అత్యంత సన్నిహిత సంబంధంగా మారింది. త్వరలోనే వివాహం చేసుకుంటానని నమ్మబలికి, అమీర్పేటలోని ఒక ఫ్లాట్లో కొన్నాళ్ల పాటు ఆమెతో రేగా కాంతారావు సహజీవనం చేసినట్లు ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ సహజీవన సమయంలో తన అనుమతి లేకుండానే ప్రైవేటు ఫొటోలు, వీడియోలు తీశారని, తదనంతరం వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డారని ఆమె పేర్కొంది.
కేవలం లైంగిక వేధింపులకే పరిమితం కాకుండా, రేగా కాంతారావు ఆర్థిక వంచనకు పాల్పడ్డారని బాధిత యువతి ఆరోపించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి, తన వద్ద నుంచి రూ. 4 లక్షల నగదును తీసుకున్నారనీ, ఆ తర్వాత డబ్బుల గురించి, పెళ్లి విషయమై నిలదీయగా ముఖం చాటేశారని వివరించింది. తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురైన సమయంలో ఈ విషయంపై మరింత ఒత్తిడి తేగా, ఆయన అనుచరుల ద్వారా కొన్ని విడతలుగా మొత్తంగా రూ. 8.5 లక్షలు తన ఖాతాకు బదిలీ చేసినప్పటికీ.. తన సమస్య కేవలం డబ్బుకు సంబంధించినది మాత్రమే కాదని ఆమె స్పష్టం చేసింది. నాలుగేళ్ల పాటు పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది.
గతంలోనే ఈ అంశంపై షీ టీమ్స్కు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ, రేగా కాంతారావు తనపైనే ఎదురు ఆరోపణలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారని బాధితురాలు ఆరోపించింది. ప్రస్తుతం తనకు, తన కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు తగిన రక్షణ కల్పిస్తూ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లిలోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆమె ఆశ్రయించగా, . నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 26న పంజాగుట్ట పోలీసులు రేగా కాంతారావుపై కేసు నమోదు చేశారు.ఈ నేపధ్యంలో రేగా కాంతారావు కూడా చట్టపరమైన రక్షణ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసి, కేసును క్వాష్ చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
Sexual harassment case against Rega Kantha Rao, , Punjagutta Police Station FIR, BRS Former MLA Rega Kantha Rao


