TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.!

Published on: Sun Jul 5, 2026 7:13AM

 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఉద్ధృతితో ఉత్తరాంధ్ర తీరం అల్లకల్లోలంగా మారింది.  విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు   మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు.    ఈ నెల 1వ తేదీన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ ఏడుగురు మత్స్యకారులు ఒకే బోటుపై సముద్రంలోకి వేటకు వెళ్లారు.   బంగాళాఖాతంలో వాతావరణం వేగంగా మారిపోవడం, అల్పపీడన తీవ్రత పెరగడంతో సముద్రంలో అలల ఉద్ధృతి  పెరిగింది. వాతావరణం అనుకూలించకపోవడాన్ని గమనించిన తీరంలోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే శనివారం ఉదయం వారిని మొబైల్ ఫోన్ల ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించారు.

ఆ సమయంలో మత్స్యకారులు స్పందిస్తూ, వాతావరణం బాలేదని, అందువల్ల శనివారం మధ్యాహ్నానికల్లా ఎలాగైనా సురక్షితంగా తీరానికి చేరుకుంటామని కుటుంబ సభ్యులకు చెప్పారు.

కానీ వారు చెప్పిన సమయానికి తిరిగి రాలేదు. వారికి ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు.  కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని  విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే..   భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు, పక్కపక్క ప్రాంతాల వారు ఇద్దరు ఇలా  ఒకేసారి సముద్రంలో చిక్కుకుపోవడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న మత్స్యశాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం, వారి బోటును గుర్తించడం కోసం కోస్ట్‌గార్డ్, స్థానిక నావికా దళాల సహాయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. 

Missing Fishermen, Visakhapatnam Fishing Harbour, Bay of Bengal Low Pressure, North Andhra Fishermen,