తెలంగాణలో ఆత్మాహుతి దాడులు జరగటం ఖాయమట!
Published on: Tue Apr 24, 2012 10:14AM
ప్రత్యేక తెలంగాణా సాధన ఉద్యమంలో ఇప్పటికే అనేకమంది విద్యార్థులు ప్రాణాలు అర్పించారు. చనిపోయిన వారిలో అత్యధికులు అణగారిన వర్గాల వారే కావటం విచారకరం. తెలంగాణా నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాలకు, వారి మాయమాటలకు విద్యార్థులు, యువకులు ప్రభావితమై క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీంతో ఆ ఆత్మహత్యలను చేసుకోవద్దంటూ తెలంగాణా నాయకులు బస్సు యాత్రలు కూడా చేస్తున్నారు. అయినా తెలంగాణాలోని కొందరు నాయకులు వారిని రెచ్చగొట్టడమే థ్యేయంగా పనిపెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
తాజాగా నల్గొండ ఎంపి గుత్తా సుఖేందరరెడ్డి విద్యార్థులు ఆత్మాహుతి దాడులకు పాల్పడాలంటూ పరోక్షంగా వారిని రెచ్చగొడుతున్నారు. తెలంగాణాపై కేంద్రప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంభిస్తే విద్యార్థులు ఆత్మహత్యలు మాని ఆత్మాహుతి దాడులకు పాల్పడతారని ఆయన హెచ్చరిస్తున్నారు. నిజానికి మనదేశంలో ఉగ్రవాదులు కూడా ఆత్మాహుతి దాడులకు పాల్పడటం లేదు. కానీ, తెలంగాణా ప్రాతంలోని విద్యార్థులను ఆత్మాహుతి దాడులకు కొందరు నాయకులు పురిగోల్పే విధంగా ప్రకటన చేయటం ఆందోళన కలిగిస్తోంది.


