TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీసీఎస్ కేసులో సంచలన మలుపు.. గర్భవతినంటూ నిదా ఖాన్ ముందస్తు బెయిల్‌ పిటిషన్!

Published on: Fri Apr 17, 2026 8:58AM

 కార్పొరేట్ రంగంలో పెను సంచలనం సృష్టించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా..  సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఇంత వరకూ పరారీలో ఉన్న  హెచ్‌ఆర్ మేనేజర్ నిదా ఖాన్ నాసిక్ జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.   తాను గర్భవతినని, మానవతా దృక్పథంతో తనకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. 

నాసిక్ టీసీఎస్ యూనిట్‌లో జూనియర్ ఉద్యోగినులపై లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి యత్నాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నిదా ఖాన్ పాత్ర అత్యంత కీలకమని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. బాధితులు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు నిదా ఖాన్  వారిని బెదిరించి, నిందితులైన సీనియర్ అధికారులకు సహకరించారని ఆరోపణలున్నాయి.   ఆమె కోసం పోలీసులు ముంబై సహా ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తుండగా,   ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సంచలనం సృష్టించింది.

తన యాంటిసిపేటరీ బెయిల్   నిదా ఖాన్ గర్భవతినని పేర్కొన్నారు.  సామాన్యంగా గర్భవతిగా ఉన్న మహిళల విషయంలో   న్యాయస్థానాలు కొంత సానుభూతి చూపే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఆమె  ప్రెగ్నెన్సీ కార్డును ఉపయోగించినట్లు తెలుస్తోంది. అయితే..  కేసు తీవ్రత దృష్ట్యా న్యాయస్థానం ఆమె విన్నపాన్ని ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ కేసులో ఇప్పటివరకు సిట్ అధికారులు ఏడుగురిని  అరెస్ట్ చేశారు. మొత్తం 9 ఎఫ్ఐఆర్‌లు నమోదుచేశారు. అలాగే టీసీఎస్ యాజమాన్యం ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులందరినీ సస్పెండ్ చేసింది. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ నేతృత్వంలో అంతర్గత విచారణ కూడా   సాగుతోంది. హిందూ దేవతలను కించపరచడం, మహిళలను బురఖా ధరించమని ఒత్తిడి చేయడం వంటి తీవ్రమైన అంశాలు ఉండటంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

నిదా ఖాన్ దాఖలు చేసిన ఈ బెయిల్ పిటిషన్‌పై నాసిక్ కోర్టు   శుక్రవారం( ఏప్రీన్ 17) విచారణ జరపనుంది.    కోర్టు ఆమెకు ఊరటనిస్తుందా లేక పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశిస్తుందా అనేది  చూడాల్సి ఉంది. మరోవైపు పోలీసులు మాత్రం ఆమెను కస్టడీలోకి తీసుకుంటేనే ఈ కేసులోని మరిన్ని లోతైన విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.