TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. జగన్‌కు ఈడీ నోటీసులు?

Published on: Fri Jun 5, 2026 5:32PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  పెను సంచలనం. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  ఉచ్చు బిగుస్తున్నది.   రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో  ఈడీ జగన్ ను విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఈ భారీ కుంభకోణానికి సంబంధించి జగన్ మోహన్ రెడ్డికి ఈడీ త్వరలోనే నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచే అవకాశం ఉందంటూ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది. గతంలో అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొన్న జగన్.. దాదాపు దశాబ్దం తరువాత మద్యం కేసులో మళ్లీ ఈడీ విచారణకు హాజరు కానున్నారు.  

 దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వ  స్థాయిలో జరిగిన అత్యంత పెద్ద ఆర్థిక మోసాలలో ఒకటిగా, ఏపీ మద్యం కుంభకోణాన్ని చెబుతారు. ఈ కేసులో భారీ మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్  సీఎంగా ఉన్న కాలంలోనే  ఈ మొత్తం వ్యవహారం నడిచినట్లు ఆరోపణలున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ లిక్కర్ స్కామ్ విలువ  3,200 కోట్లుగా దర్యాప్తు సంస్థలు తేల్చాయి.  ఇంతటి భారీ మొత్తంలో నిధులు పక్కదారి పట్టడం, ప్రభుత్వ ఖజానాకు గండి పడటాన్ని  కేంద్ర దర్యాప్తు సంస్థ  తీవ్రంగా పరిగణిస్తోంది. నాణ్యత లేని మద్యం సరఫరా చేయడంతో పాటు, కేవలం నగదు రూపంలోనే (క్యాష్ ఓన్లీ) లావాదేవీలు సాగించడం ఈ కుంభకోణంలో ప్రధానమైన అంశం. డిజిటల్ పేమెంట్లను అనుమతించకపోవడం వెనుక వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. 

ఏపీ మద్యం కుంభకోణం విచారణలో భాగంగా ఈడీ ఇప్పటికే  జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులైన కీలక నేతలను విచారించింది.  వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వంటి ప్రముఖులు కూడా ఈడీ విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు.  ఈ విచారణల ద్వారా జగన్  హయాంలో జరిగిన ఆర్థిక అక్రమాలకు సంబంధించి కీలకమైన, తిరుగులేని ఆధారాలను ఈడీ సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో లభించిన డాక్యుమెంట్లు, డిజిటల్ సాక్ష్యాల ఆధారంగానే ఈడీ జగన్ ను విచారించాలన్న నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.   

రాజకీయ, అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ఏపీ మద్యం కుంభకోణం  అవినీతి సొమ్ములో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను అక్రమమార్గాల ద్వారా  దుబాయ్‌కు  తరలించారు. అందుకు సంబంధించిన ఆధారాలతోనే ఈడీ జగన్ ను విచారణకు పిలవనుందని అంటున్నారు.