ప్రముఖ జర్నలిస్టు తుర్లపాటి కుటుంబరావు కన్నుమూత

ప్రముఖ జర్నలిస్ట్ పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు(89) కన్నుమూశారు.  ఆదివారం  రాత్రి కుటుంబరావు గుండెపోటుకు గురికావడంతో వెంటనే విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో అనేక మంది పాత్రికేయ ప్రముఖులు శోఖసంద్రంలో మునిగారు.  1933 ఆగస్టు 10న జన్మించిన తుర్లపాటి 14 ఏళ్ల వయస్సులో జర్నలిజంలోకి అడుగు పెట్టారు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు అనేక విషయాలపై విశ్లేషణలు చేశారు. జర్నలిస్టుగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సభ అధ్యక్షుడిగా, అనువాద ప్రసంగికునిగా తుర్లపాటి కుటుంబరావు ప్రసిద్ధికెక్కారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నుంచి మొదలు కొని నారా చంద్రబాబు నాయుడు వరకు 18 మంది ముఖ్యమంత్రులతో తుర్లపాటి పనిచేశారు. ఆయన రాసిన ‘18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు’ అనే పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పద్మశ్రీ అవార్డు పొందిన తొలి తెలుగు జర్నలిస్టుగా పేరు గడించారు. జర్నలిస్టుగా, రచయితగా, వక్తగా ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్రం ప్రభుత్వం 2002లో ప్రతిష్టాత్మక పద్మశ్రీని అందించింది.   

 1951లో ఆచార్య ఎన్‌జీ రంగారావు వాహిని పత్రికలో మొదటిసారిగా కుటుంబరావు ఉప సంపాదకుడిగా పనిచేశారు. అనంతరం చలసాని రామారాయ్‌ ‘ప్రతిభ’ పత్రికకు ఎడిటర్‌గా విధులు నిర్వర్తించారు. రాజకీయలపై చేస్తున్న విశ్లేషణలను చూసి టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన్ని చెన్నైకి పిలిపించి, తను నడుపుతున్న ప్రజాపత్రికలో సహాయ సంపాదకుడిగా నియమించారు. అంతేకాకుండా సహాయ సంపాదకుడితో పాటు ప్రకాశం పంతులుకు కార్యదర్శిగానూ ద్విపాత్రాభినయం చేశారు. ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో కుటుంబరావును తనతో పాటే ఉండమని చెప్పారు. దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రభుత్వంలో ఉండి నిజాలను కప్పిపెడుతూ రాయలేనని, జర్నలిస్టుగానే ఉంటానని కుటుంబరావు పేర్కొన్నారు. దీంతో ఆయనకు పాత్రికేయ వృత్తిపై ఎంత నిబద్ధత ఉందో అర్థమవుతోంది. అనంతర కాలంలో ఆంధ్రజ్యోతికి ఎడిటర్‌గా విధులు నిర్వర్తించారు.   

 విజయవాడకు వచ్చిన మహత్మా గాంధీ నుంచి 14 ఏళ్ల ప్రాయంలో ఆటోగ్రాఫ్‌ పొందారు. ప్రముఖ నాయకులు అంబేద్కర్‌, నెహ్రూ, రాజాజీలను ఇంటర్వ్యూ చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయవాదులు, ప్రముఖ వ్యక్తులు ఇలా దాదాపు 6 వేల బయోగ్రఫీలను ఆయన రాశారు. ఇలా తెలుగు సాహిత్యంలో వ్యక్తుల జీవిత చరిత్రల రచయితగా ముద్ర వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో దాదాపు 20 వేల సమావేశాల్లో వక్తగా ప్రసంగించారు. దీంతో గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించారు. జాతక కథలు, జాతి నిర్మాతలు, మహానాయకులు, విప్లవ వీరులు, నా కలం నా గళం, 18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు తదితర పుస్తకాలు రాశారు. ప్రముఖ జాతీయ నేతల ప్రసంగాలను తెలుగులోకి అనువాదం చేశారు.     

 తుర్లపాటి కుటుంబరావు మృతి పట్ల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. ‘‘తుర్లపాటి పరమపదించారని తెలిసి విచారించాను. టంగుటూరి ప్రకాశం పంతులు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన నాటి నుంచి ప్రతి రంగంలోనూ ఉన్నత ప్రమాణాలు పాటించి ఆదర్శంగా నిలిచారు. ఆయన చూపిన మంచి మార్గం, సాంప్రదాయాలని పాటించడమే, ఆయనకి మనమిచ్చే నిజమైన నివాళి. కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ తుర్లపాటికి  వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. తుర్లపాటి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ సీనియర్ పాత్రికేయునిగా, గొప్ప వక్తగా, రచయితగా తుర్లపాటి సేవలు శ్లాఘనీయం. పద్మశ్రీ, కళాప్రపూర్ణ తదితర అనేక పురస్కారాలే తుర్లపాటి ప్రతిభకు తార్కాణాలు. ఆయన మృతితో బహుముఖ ప్రజ్ఞావేత్తను రాష్ట్రం కోల్పోయింది. తుర్లపాటి కుటుంబరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.