వైభవంగా ప్రారంభమైన ఉజ్జయిని మహంకాళి బోనాలు

సుప్రసిద్ధ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెల్లవారుజామున 4 గంటలకు కుటుంబసమేతంగా తొలి బోనం సమర్పించారు. అంతకు ముందు మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తలసాని..బోనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపండుగగా గుర్తించిన తర్వాత అత్యంత వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది మంచి వర్షాలు పాడిపంటలతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు. అమ్మకు బోనాలు సమర్పించడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు.