తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్!

కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే స్కూళ్ల నిర్వహణపై తెలంగాణ సర్కార్ స్పష్టతనిచ్చింది. ఫిబ్రవరి ఒకటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రగతి భవన్‌ లో మంత్రులు, కలెక్టర్లతో సమావేశమైన ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9వ తరగతి ఆపై తరగతులను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవల జనవరి 18 నుంచి ఇంటర్, డిగ్రీ కాలేజీలు తెరిచేందుకు విద్యా శాఖ ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. దీంతో విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం తగు ప్రణాళికలను రూపొందిస్తుంది.