TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టర్కీలో రక్తమోడిన పాఠశాల.. విద్యార్థి కాల్పుల్లో 9 మంది మృతి

Published on: Thu Apr 16, 2026 9:43AM

టర్కీలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్నారి విద్యార్థి   తోటి విద్యార్థులపై తూటాల వర్షం కురిపించాడు. కహ్రామన్‌మరాస్ ప్రావిన్స్‌లోని ఒక పాఠశాలలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడిన విద్యార్థి కూడా చివరకు మరణించడంతో పాఠశాల ప్రాంగణం రక్తసిక్తమైంది. వివరాలిలా ఉన్నాయి. 

 అయ్సెర్ కాలిక్ మిడిల్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల ఇసా అరాస్ మెర్సిన్లీ అనే విద్యార్థి   బుధవారం (ఏప్రిల్ 15)  స్కూలుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న ఆయుధంతో  రెండు వేర్వేరు తరగతి గదుల్లో అందరూ చూస్తుండగానే కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా పేలిన తూటాలతో విద్యార్థులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు.

ఈ కాల్పుల ఘటనలో ఒక ఉపాధ్యాయుడు, ఎనిమిది మంది విద్యార్థులూ మరణించగా, మరో 13 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు, వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించగా, వారిలో ఆరుగురి పరిస్థితి  విషమంగా ఉంది. నిందితుడు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

దర్యాప్తులో భాగంగా నిందితుడి తండ్రి ఉగుర్ మెర్సిన్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన గతంలో పోలీస్ అధికారిగా పనిచేసినట్లు గుర్తించారు. తన తండ్రికి చెందిన ఐదు తుపాకులను నిందితుడు ఈ దాడి కోసం ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడైన విద్యార్థి పోలీసుల కాల్పుల్లో చనిపోయాడా లేక తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడా అన్న విషయంలో క్లారిటీ లేదు. టర్కీలో  రెండు రోజుల వ్యవధిలోనే  పాఠశాల కాల్పుల ఘటన  జరగడం ఇది రెండోసారి.  దేశంలో పెరుగుతున్న ఆయుధ సంస్కృతి,   టీనేజర్లలో పెచ్చరిల్లుతున్న హింసా ప్రవృ త్తిపై ఆందోళన వ్యక్తమౌతోంది.