ఇకపై నోరు అదుపులో పెట్టుకోండి...?
posted on Jan 19, 2018 10:03AM
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారట. ఇంతకీ ఆమె ఎవరికి వార్నింగ్ ఇచ్చింది అనుకుంటున్నారా...? ఎవరికో కాదు తమ కుటుంబసభ్యులకే వార్నింగ్ ఇచ్చిందట. జయలలిత మరణానంతరం శశికళపై ఆమె కుటుంబ సభ్యులపై పలు అభియోగాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అసలు జయలలితను శశికళే చంపిందన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక ఆతరువాత ఆమె జైలుకు వెళ్లడం...వరుసగా శశికళ, ఆమె కుటుంబసభ్యులపై ఐటీ దాడులు జరగడం.. చూస్తూనే ఉన్నాం. ఇక దీనిపై ఆమె స్పందిస్తూ...తన కుటుంబసభ్యులను హెచ్చరిస్తూ.. ఓ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ‘మన కుటుంబంపై కేంద్రానికి ఇప్పటికే ఓ నివేదిక అందింది. దాని పర్యావసనమే ఐటీ దాడులు. హోంశాఖ తన నివేదికలో పేర్కొన్న అంశాలు నిజమన్నట్లుగా మీరంతా ఇలానే వ్యవహరిస్తే నేను జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది’అని ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇకపై నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారట. కాగా శశికళ ఉత్తరం అందుకోవడం వల్లే కొత్త పార్టీ ఏర్పాటుపై దినకరన్ వెనక్కుతగ్గారని తెలుస్తోంది.