పాపం చిన్నమ్మ..పార్టీ నుండి ఔట్....
posted on Sep 12, 2017 3:51PM
పాపం శశికళ అనుకున్నదొక్కటీ.. అయినది ఒక్కటీ... జయలలిత మరణానంతరం సీఎం పీఠం అధిష్టించి.. తమిళనాడును ఏలదామని అనుకున్నారు. కానీ అవేమీ కుదరలేదు. పన్నీర్ సెల్వం సడెన్ రివర్స్ అవ్వడం.. ఆమె జైలుకు వెళ్లడం.. అన్నీ జరిగిపోయాయి. అయినా కూడా ఆమె మాత్రం జైలు నుండే తన పెత్తనం కొనసాగించాలని చూసింది. అందుకే దినకరన్ ను రంగంలోకి దించింది. కానీ దినకరన్ పై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మూడు వర్గాలుగా ఉన్న అన్నాడీఎంకే.. పన్నీర్ సెల్వం... పళని కలవడంతో రెండు వర్గాలుగా అయ్యాయి. ఇక వీరిద్దరూ కలిసిన తరువాత.. శశికళను, దినకరన్ నుండి పార్టీ నుండి బయటకు పంపిస్తారన్న వార్తలు వినిపించాయి. ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఒక్కటై శశికళ వర్గాన్ని బయటికి నెట్టారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న శశికళను పార్టీ నుంచి తొలగించారు. అలాగే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్న దినకరన్ను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం తమిళనాడు మంత్రి ఉదయ్కుమార్ తీర్మానాన్ని చదివి వినిపించారు.