బీజేపీ గూటికి కోమటిరెడ్డితో పాటు ఇద్దరు మాజీ మంత్రులు!!
posted on Jun 24, 2019 12:21PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొద్దిరోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు తెలంగాణాలో బీజేపీదే భవిష్యత్తు అన్నట్టుగా మాట్లాడారు. దీంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఆయన త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో బీజేపీలో చేరిక ముహుర్తాన్ని ఖరారు చేస్తారని సమాచారం. అయితే, ఆయనతోపాటు మరో ఇద్దరు కీలక నేతలు కూడా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరూ మాజీ కేంద్రమంత్రులే. ఒకరు సర్వే సత్యనారాయణ, మరొకరు బలరామ్ నాయక్. ఈ ఇద్దరూ బీజేపీ అధినాయకత్వంలో మంతనాలు సాగించినట్టు సమాచారం. ఈ ఇద్దరికీ ఢిల్లీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందనీ, రాజగోపాల్ రెడ్డితో కలిసి చేరేందుకు సిద్ధంగా ఉండాలనే సంకేతాలు కూడా అందినట్టు ప్రచారం జరుగుతోంది.