TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ ప్రభుత్వానికి స్వరూపానంద శాపనార్ధాలు

Published on: Mon Mar 16, 2015 8:59AM

 

ఈ ఏడాది నుండి శ్రీ రామనవమి ఉత్సవాలను కడప జిల్లాలో ఒంటిమిట్ట శ్రీరామాలయంలో అధికారికంగా నిర్వహించాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని విశాఖకు చెందిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తీవ్రంగా తప్పు పట్టారు. హిందూమత సంబంధమయిన ఇటువంటి విషయాలలో ప్రభుత్వం తమవంటి మఠాధిపతులు, సాధువుల సలహాలు తీసుకోవడం అధికారుల సలహాలను పాటించడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇదివరకు గోదావరి పుష్కరాలకు కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తమనెవరినీ సంప్రదించలేదని ఇప్పుడు శ్రీ రామనవమి ఉత్సవాలకు కూడా సంప్రదించకపోవడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం తలబెట్టే ఇటువంటి కార్యక్రమాలకి ఆ దేవుడి ఆశీసులు కూడా దక్కవని అన్నారు. తమను పక్కనబెట్టి ముందుకు వెళ్ళినట్లయితే ప్రభుత్వం కూలిపోతుందని శపించారు.

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెపుతున్నారు. ఆయన  కొన్ని రోజుల క్రితం విశాఖ వచ్చినప్పుడు పనిగట్టుకొని వెళ్లి స్వామీ స్వరూపానందను కలవడం అందరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది. జగన్మోహన్ రెడ్డి ఆయనను దర్శించుకొని సేవించుకొన్నందునే స్వామీజీకి జగన్ పై అనుగ్రహం కలిగి ఇప్పుడు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిలాగే ఈ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చేపుతున్నారేమో? మతంపేరుతో స్వామీజీలు ఈవిధంగా రాజకీయాలలో, ప్రభుత్వ నిర్ణయాలలో వేలుపెట్టాలనుకోవడం, లేకపోతే ఈ విధంగా ప్రజలెన్నుకొన్న ప్రజా ప్రభుత్వాలు కూలిపోతాయని శాపాలు పెట్టడం సమంజసమేనా? ఈ విధంగా తెర వెనుక రాజకీయాలు చేస్తూ, ప్రభుత్వాలను అప్రదిష్టపాలు జేస్తూ ప్రభుత్వాలకు శాపనార్ధాలు పెట్టే బదులు స్వామీజీలు, వాస్తు సిద్దాంతులకు రాజకీయాల మీద అధికారం మీద అంత మక్కువ ఉంటే వారు కూడా ఎన్నికలలో పోటీచేసి గెలిచి ప్రభుత్వాన్ని తమకు నచ్చినట్లు నడిపించుకోవచ్చు కదా?