మా పార్టీ ఓడిపోతుంది.. బీజేపీ సంచలన వ్యాఖ్యలు

గుజరాత్ ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రధాని నరేంద్రమోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇద్దరు కలిసి హోరాహోరీగా ప్రచారం చేశారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లోనూ విజయం బీజేపీదేనని బల్లగుద్ది చెబుతుంటే.. ఆ పార్టీకే చెందిన ఎంపీ గుజరాత్‌లో బీజేపీ ఓడిపోవడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనో ఎవరో కాదు రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంజయ్ కాకడే. అందుకు ఆయన ఒక వాదన కూడా వినిపిస్తున్నారు. తమ టీమ్ ప్రత్యేకంగా సర్వే జరిపిందని.. వాళ్లంతా గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి రైతులు, డ్రైవర్లు, కార్మికులను కలిశారు. ఆ సర్వే ప్రకారం మెజారిటీ సంగతి పక్కనబెడితే.. కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం కూడా బీజేపీ సంపాదించలేదని.. కానీ కాంగ్రెస్ మెజారిటీకి దగ్గరకు వస్తుందని జోస్యం చెప్పారు. గత 22 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉండటంతో పార్టీపై ప్రజల్లో విముఖత ఏర్పడిందని.. అందుకే తమ పార్టీ ఓడిపోతుందని కాకడే చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి.