గోదావరిలో ఇసుకమేటలే తప్ప నీళ్ళు లేవు
Published on: Fri May 4, 2012 10:00AM
గల ... గల ... పారే గోదావరి నేడు నీరు లేక బావురుమంటోంది. నదీ గర్భాశయంలో ఆఖరి నీటిబొట్టు కూడా ఆవిరైపోవడంతో ప్రస్తుతం ఇసుకరాసులు మాత్రమే దర్శనమిస్తున్నాయి. కాటన్ బ్యారేజ్ ఎగువన కూడా ఇదే దృశ్యం కనిపిస్తోంది. దీంతో రైతులు, ఇరిగేషన్ అధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 15వ తేదీన సార్వాసాగుకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే బ్యారేజ్ వద్ద వీటిమట్ట్టం ప్రమాదస్థాయికి పడిపోయింది.
అష్టకష్టాలుపడి రబీసీజన్ ను గట్టెక్కించిన ఇరిగేషన్ అధికారులు త్వరలో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్ గురించి భయపడిపోతున్నారు. నదిలో నీరులేకపోవటం, ఎగువ ప్రాంతాల నుంచి నీరు విడుదల కాకపోవటంతో ఖరీఫ్ కు నీరు ఎలా ఇవ్వాలా అన్న అంశంపై ఇరిగేషన్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ తరుణంలో వర్షాలు కురిస్తే పరిస్థితి కొంత మెరుగవుతుందని వారు అంటున్నారు. సార్వా సాగుకు నారుమళ్ళు సిద్ధం చేసుకునేందుకు మే మూడోవారంలో నీటిని సరఫరా చేయాల్సి ఉండగా, నీటి కొరత స్పష్టంగా కనిపిస్తుండటంతో తూర్పుగోదావరిజిల్లా రైతాంగం ఆందోళన చెందుతోంది.


