అక్రమంగా మట్టిని తవ్వే మాఫియాను అడ్డుకోరా?
posted on Apr 6, 2020 1:20PM
మంత్రి అనుచరులైతే అక్రమంగా మట్టి తరలిస్తారా? ఒక పక్క లాక్డౌన్ అమలు అవుతోంది. అయినా మంత్రి అనుచరులు ట్రాక్టర్ల ద్వారా మట్టిని అక్రమంగా తవ్వి, కళ్యాణమండపంతో పాటు మూడు ప్లాట్లకు తరలిస్తున్నారు. లాక్డౌన్ మీకు వర్తించదా? అని గ్రామస్థులు నిలదీస్తే జనం మీదకే ట్రాక్టర్లను నడపడానికి వెళ్ళుతూ భయపెడుతున్నారట. గ్రామస్థులంతా ఏకమై ట్రాక్టర్లను అడ్డుకున్నారు.
ఒక పక్క ప్రభుత్వం కరోనా వ్యాప్తి ని నివారించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంటే గుడివాడ నియోజక వర్గ పట్టణ నడి బొడ్డు లో గౌతమ్ స్కూల్ దగర కొన్ని ఖాళీ స్థలాల్ని పూడ్చడానికి మట్టి ని ఇష్టానుసారంగా తరలిస్తున్నారు ఇదేమిటి అని స్థానికులు ప్రశ్నించగా మంత్రి కొడాలి నాని తాలూకా అని దౌర్జన్యం చేస్తున్న వైనం. సామాన్యుడు కి ఒక న్యాయం మంత్రి అనుచరులకు ఒక న్యాయం అని జనం తిరగబడ్డారు. వి.ఆర్.వో. దగ్గరుండి మట్టి తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
తాము కూరగాయలు కొనడానికి వెళ్ళితే వెంటబడి పోలీసులు తరుముతున్నారు. కానీ ఇక్కడ మంత్రి అనుచరులు అక్రమంగా మట్టి తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా పోలీసులు, మీడియా చూసి పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు.