వనరుల్ని కొల్లగొడుతున్న ఇసుక మాఫియా
Published on: Fri Aug 31, 2012 12:25PM
ఏటిగట్టుకు ఇసుక కొట్టుకొస్తుంది. ఎంత తవ్వితే అంతగా మళ్లీ పోగుపడుతుంది. ఈ రెండు విషయాలూ చదువుకున్నవాళ్లే చెప్పక్కర్లా.. అక్షరం ముక్కరాని వేలు ముద్ర బాపతులుకూడా బల్లగుద్దిమరీ గట్టిగా చెబుతారు. మరి అంత పుష్కలంగా ఎప్పటికప్పుడు పైనుంచి ప్రవాహంలో కొట్టుకొచ్చి కింద పేరుకుపోయే ఇసుకను లారీలకెత్తి తరలించుకుపోతే ఏటిగట్టు ఖాళీ అయిపోతుందా.. కొంతవరకూ ఈ వాదన కూడా నిజమే.. మరీ మొత్తంగా పొక్లెయిన్లతో అడుగుకంటా ఊడ్చేస్తే ఏరు ఎండిపోయే ప్రమాదంకూడా ఎక్కువే.. కానీ మోతాదు మించకుండా తగిన పరిమాణంలో తవ్వుకుంటే మాత్రం ఎప్పటికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
.jpg)
మరి అంత పుష్కలంగా దొరికే ఇసుకకు ఎందుకంతే డిమాండ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. లారీ రెండువేల రూపాయలు అమ్మాల్సిన ఇసుకధర ఒక్కోసారి ఇరవై వేల రూపాయలదాకా ఎందుకుపోతోంది. సామాన్యులకెవరికీ తెలియని చిదంబర రహస్యమిది. ఇసుక కాంట్రాక్టర్లు సిండికేటై ఆడుతున్న దొంగనాటకమిది. నిజానికి రాష్ట్రంలో ఓ వంద ఇసుక క్వారీలు ఉన్నాయనుకుందాం.. కూడబలుక్కున్న కాంట్రాక్టర్లు.. వాటిలో పది క్వారీలకు మాత్రమే పనిపెట్టి లేనిపోని కొరతను సృష్టిస్తారు. ఇసుక రేటు మండిపోతోందంటూ అప్పటికప్పుడు డిమాండ్ కి అనుగుణంగా విపరీతంగా రేటు పెంచుకుంటూ పోతారు. అంతా ఒక్కమాటమీదే ఉంటారు కాబట్టి లోడు ఇరవై వేలన్నా.. అవసరంకోసం చచ్చినట్టు కొనుక్కుతీరాల్సిందేమరి.

కొత్తవాళ్ల ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టకుండా పాతవాళ్లంతా చాలా కట్టుగా ఉంటారు. ఎవరైనా మొండివాడు పట్టుబట్టి నిలబడి టెండర్ దక్కించుకుంటే అంతా కలిసి వాణ్ణి ముప్పుతిప్పలు పెడతారు. ఆ టెండర్ పాస్ కాకుండా చూసేందుకు ఎన్నెత్తులు వేయాలో అన్నెత్తులేస్తారు. ఆఖరి అస్త్రంగా కొత్త కాంట్రాక్టర్ ని అస్త్ర సన్యాసం చేయించేందుకు కోర్టుకెక్కి స్టే తీసుకురావడం ఇప్పుడు కొత్త ఆనవాయితీగా మారింది. ఇలాంటి ఘనకార్యాలకోసం లక్షలాది రూపాయలు ఘరానాగా చేతులుమారతాయి. లెక్క ఎక్కడికక్కడే చాలా పక్కాగా ఉంటుంది. కానీ.. పది లారీల ఇసుకను తవ్వాల్సిన చోట వందలారీల ఇసుకను తవ్వుకుపోయినదానికి మాత్రం ఎలాంటి లెక్కలూ ఉండవు. అసలిలాంటి లెక్కల్ని అడిగేవాళ్లే లేరు.

నువ్వుకూడా మాతో కలిస్తేనే మళ్లీ నీ వ్యాపారం నువ్వు చేసుకోవడానికి వీలౌతుందని కొత్త వ్యాపారిని బెదిరిస్తారు. కానీ ఇలాంటి లెక్కలన్నీ నోటిమాటమీదే చలామణీలో ఉంటాయ్. కాయితంముక్కమీద చిన్న ఆధారంకూడా దొరకదు. అప్పటికే రెండుమూడేళ్లు వృథాగా గడిచిపోయాయి కాబట్టి చేసేదేంలేక కొత్త కాంట్రాక్టర్ కూడా సిండికేట్ కి పగ్గాలు అప్పజెప్పేసి కాస్తో కూస్తో వాళ్లు విదిలించిన వాటాని తీసుకునేందుకు సిద్దపడతాడు. ఇసుక మాఫియా కృత్రిమంగా కొరతను సృష్టించి దోపిడీ రాజ్యాన్ని చెలామణీ చేస్తున్న పాపంలో ఇష్టమున్నా లేకపోయినా పాలుపంచుకోక తప్పని పరిస్థితి. పైగా భారీఎత్తున పెట్టుబడిపెట్టి, టెండర్ దక్కించుకుని దమ్మిడీ ఆదాయం లేక, చివరికి మళ్లీ కాంట్రాక్ట్ ని అదే సిండికేట్ చేతుల్లో పెట్టడంతప్ప మరేమీ చేయలేని పరిస్థితి, కొత్త వ్యాపారులది. అటు దేశం సొమ్ముని దోచుకుంటూ, ఇటు వినియోగదారుల్ని మోసం చేస్తూ ఇసుక మాఫియా రెండువిధాలుగానూ లాభపడుతోంది. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే చేతనైంది చేసుకోమని బాహాటంగానే బెదిరిస్తారు ఘనతవహించిన ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు.


