అసలు మనం దాడి చేశామా? 300 మందిని చంపామా?

 

భారత వాయుసేన పాక్‌లోని బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే భారత వాయుసేన అధికారులు మాత్రం మృతదేహాలను లెక్కించడం మా పని కాదని, టార్గెట్ పూర్తి చేయడమే మా పని, ఎంత మంది చనిపోయారు? ఇలాంటి లెక్కలన్నీ ప్రభుత్వం చూసుకుంటుంటుందని చెప్పారు. మరోవైపు ప్రపంచ మీడియా ఈ దాడిపై అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో విపక్షాలు ఈ దాడికి సంబంధించిన ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేశాయి. బీజేపీ నేతలేమో విపక్షాలకు దేశభక్తి లేదంటూ విమర్శిస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సలహాదారు శామ్‌ పిట్రోడా ఈ దాడి గురించి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

శామ్‌ పిట్రోడా తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ..  'వారు 300 మందిని చంపితే మంచిదే. కాకపోతే నేను అడిగేది ఒక్కటే. దానికి సంబంధించి మరిన్ని ఆధారాలు, వాస్తవాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసలు మనం దాడి చేశామా? 300 మందిని చంపామా? నాకైతే తెలియదు. ఒక పౌరుడిగా నాకు అడిగే హక్కు ఉంది. నేను  అడుగుతాను. అంతమాత్రాన నేను ఇటు వైపో, అటు వైపో ఉన్నట్లు కాదు. మనకు మరిన్ని నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు 300 మందిని చంపితే భారత ప్రజలకు తెలుసుకొనే హక్కు ఉంది. కానీ ప్రపంచ మీడియా మాత్రం అక్కడ ఎవరూ చనిపోలేదనే చెబుతోంది. ఒక భారతీయ పౌరుడిగా నాకు అది ఏమాత్రం బాగోలేదు.’ అన్నారు. పుల్వామా తర్వాత ప్రస్తుత ప్రధాని మోదీ తీరును నేను వ్యతిరేకిస్తున్నా అని తెలిపారు. ‘నేను గాంధేయ వాదిని. దయా, గౌరవం వంటి అంశాలను నమ్ముతాను. చర్చలపైనే నాకు నమ్మకం ఉంది. పాకిస్థాన్‌తో మాత్రమే దేనికి. మనం ప్రతిఒక్కరితో చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మొత్తంతో చర్చించాలి.’ అని పేర్కొన్నారు. ‘ఇవన్నీ నా వ్యక్తిగతంగా అడుగుతున్నవే. ఒక శాస్త్రవేత్తగా అడుతున్నవి. నేను కారణాలు, లాజిక్‌, ఆధారాలను నమ్ముతాను. నేను భావోద్వేగాలను నమ్మను.’ అని అన్నారు. ‘సరిహద్దుల్లో శత్రువులు ఉన్నారనే భయం ప్రజల్లో సృష్టించడం ఇప్పుడు సరికొత్త సూత్రంగా మారింది. భారత్‌లో అయితే అది పాకిస్థాన్‌ అని చెబుతారు, అమెరికాలో అయితే మెక్సికన్‌ వలసదారులు అని చెబుతారు. సమర్థులు లేకపోవడం వల్ల పరిస్థితులు అన్నీ దారుణంగా ఉన్నాయని అంటారు.’ అని పిట్రోడా విమర్శించారు.