TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లడ్డూ ప్రసాదం విక్రయాలు భలే జోరు

Published on: Sat Apr 11, 2026 10:43AM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్నది.   అదే సమయంలో స్వామివారి లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ అంతకు మించి పెరుగుతోంది.   2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం తిరుమల  లడ్డూ ప్రసాదం విక్రయాలు గతంలో ఎన్నడూ లేని  అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రసాదం అమ్మకాల ద్వారా టీటీడీకి భారీ ఆదాయం కూడా సమకూరింది.

గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు మొత్తం 13,95,43,231 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది భారీ పెరుగుదల.  2024-25 కాలంలో 12,18,53,535 లడ్డూలు అమ్ముడవగా, కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే అదనంగా సుమారు 1.76 కోట్ల లడ్డూల విక్రయాలు పెరగడం గమనార్హం. లడ్డూ ప్రసాదం విక్రయాలలో భారీ పెరుగుద తో టీటీడీకి సుమారు రూ. 567 కోట్ల మేర ఆదాయం లభించింది. భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుండటంతో, వారి అవసరాలకు తగినట్లుగా టీటీడీ ప్రస్తుతం రోజుకు సగటున 4 లక్షల లడ్డూలను ఉత్పత్తి చేస్తోంది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అధునాతన పద్ధతుల్లో ఈ ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుత నిబంధనల ప్రకారం శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి టీటీడీ ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తోంది. అంతకు మించి అదనంగా లడ్డూలు కావాలనుకునే భక్తులకు ఒక్కో లడ్డూ ప్రసాదాన్ని రూ. 50 చొప్పున విక్రయిస్తున్నారు. పవిత్రమైన ఈ ప్రసాదం కోసం భక్తులు ఎంతటి రద్దీ ఉన్నా వేచి ఉండి మరీ కొనుగోలు చేస్తుండటం కద్దు. 

భవిష్యత్తులో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో, లడ్డూ పోటు   సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ప్రసాదం తయారీలో స్వచ్ఛమైన నెయ్యి, యాలకులు, ఇతర దినుసుల లభ్యతను ముందే సేకరించి నిల్వ ఉంచుతోంది. రాబోయే రోజుల్లో ఈ అమ్మకాల రికార్డులు మ కొత్త శిఖరాలను తాకడం ఖాయమని అధికారులు చెబుతున్నారు.