TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అంతా స‌జ్జ‌ల‌నే చేస్తున్నారా?.. వైసీపీలో అసంతృప్తికి ఆయనే కారణమా?

Published on: Tue Apr 12, 2022 2:44PM

'శత్రువులు ఎక్కడో ఉండరు.. చెల్లెలుగా, కూతురుగా మన ఇంట్లోనే, మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు'..  ఇది 'అఆ' సినిమాలో డైలాగ్. ఈ డైలోగును కూసింత మార్చేస్తే, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అతికినట్లు సరిపోతుందని అంటున్నారు. అవును, ఆయన శత్రువులు కూడా ఎక్కడో లేరు, ఆయన చుట్టూనే ఉన్నారు. ఆయన చుట్టూనే తిరుగుతున్నారు. అలాంటి అంతర్గత శత్రువులు చాలామందే ఉన్నా.. అందరికీ తెలిసిన ఒకే ఒక్కడు మాత్రం.. ప్రభుత్వ ప్రధాన సలహదారు, శ్రీశ్రీశ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి. ఈ మాట అంటోంది మ‌రెవ‌రో కాదు.. మంత్రి పదవులు ఆశించి భంగపడిన వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వారి అనుచరుల ఆరోపణ. నిజానికి, భంగపడిన నాయకులే కాదు, పార్టీ అభిమానులు, సామాన్య కార్యకర్తలు కూడా, ‘అంతా ఆయనే చేశారు’ అంటూ  సజ్జలపై మండి పడుతున్నారు. వైసీపీ కార్యకర్తలు సజ్జలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మాజీమంత్రి సుచరిత ఇంటి దగ్గర బహిరంగంగా సజ్జలకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. సుచరిత అభిమానులే కాదు.. మచిలీపట్నం, ఏలూరులో కూడా అవే నినాదాలు. అలాగే, సజ్జల ఎవరు? ఆయనకు ఇంత పవరేంటి? అనేమాట మాజీల మాటల్లో వినిపిపిస్తోంది.

అదలా ఉంటే సజ్జల, వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రికి అయిన వారందరినీ ఒక్కొక్కరినీ దూరం చేసి, ఆయన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారనే అభిప్రాయం ఇటు పార్టీలో, అటు ఫ్యామిలీలో కూడా వినిపిస్తోంది. అయితే, సజ్జల కుట్రలను ఎవరికి వారు తమదాకా వస్తే కానీ గ్రహించలేక పోతున్నారని పరిశీలకులు అంటున్నారు. ముందుగా, జగన్ రెడ్డికి అన్ని విధాల నెంబర్ టూ (2)గా ఉన్న సాయి రెడ్డిని, ఆ తర్వాత తల్లి  విజయమ్మ, చెల్లి  షర్మిలను దూరం చేశారు. ఇప్పుడు మంత్రివర్గం విస్తరణలో మరో బంధువు బాలినేనిని దూరం పెట్టారు. అంతే కాదు చాకచక్యంగా, పూర్వాశ్రమ జర్నలిస్ట్ బంధాలను ఉపయోగించుకుని, జగన్ రెడ్డికి సొంత తల్లీ, చెల్లి చివరకు ఇప్పుడు తల్లి తరపు బంధువు బాలినేనిని దూరం చేయడంలో జగన్ రెడ్డి భార్య వైఎస్ భారతిని దోషిగా చిత్రించే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. 

నిజమే, కావచ్చును, వైఎస్ భారతిలోనూ అధికారం మీద ఆశ‌లు ఉంటే ఉండవచ్చును. రేపు జరగరానిది ఏదైనా జరిగి జగన్ రెడ్డి జైలుకుపోతే, తానే ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఆమెలో ఉంటే ఉండవచ్చును కానీ, రాజకీయంగా పావులు కదుపుతోంది, జగన్ రెడ్డికి అయిన వారందరినీ దూరం చేస్తోంది మాత్రం, సజ్జలే అని అంటారు. అంతే కాదు, సజ్జల చివరకు, ఆ ఇద్దరి మధ్యన కూడా దూరం పెంచినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. 

అదేవిధంగా పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రికి మధ్య వారధిగా నిలిచి, ఉద్యోగుల్లో తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడేందుకు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా సజ్జలే కారణమని  అప్పట్లోనే ఉద్యోగులు ఆరోపించారు.ఉద్యోగ సంఘాల నాయకులను బుట్టలో వేసుకుని సజ్జల చక్రం తిప్పారని, దాని వలన సమస్య తాత్కాలికంగా పరిష్కారం అయినా, శాశ్వత శతృత్వం మిగిలే ఉందని, ఉద్యోగుల బాహిరంగంగానే సజ్జల వైపు వేలెత్తి చూపారు.   నిజానికి, ప్యాలెస్ కుట్రల సంగతి ఎలా ఉన్నా, పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో సజ్జల జోక్యం మితి మీరిపోతోందన్న అభిప్రాయం అయితే సర్వత్రా వినవస్తూనే వుంది. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం సజ్జల కనుసన్నల్లో పనిచేస్తుందనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. 

అలాగే ముఖ్యమంత్రికి పార్టీకి మధ్య సజ్జల అడ్డుగోడ కట్టారని పార్టీ వర్గాలలో ఎప్పటి నుంచో  వినవస్తోంది. నిజానికి, వైసీపీలో ఈరోజు భగ్గుమంటున్న అసంతృప్తికి, జగన్ రెడ్డి అజ్ఞానం, అహంకారమే ప్రధాన కారణం అయినా, అగ్నికి ఆజ్యం తోడైనట్లు, జగన్ రెడ్డి అజ్ఞాన, అహంకారాలకు సజ్జల, కుట్రపూరిత  స్వార్థం  ఆజ్యంలా తోడైందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అయితే, సజ్జల ఇవ్వన్నీ ఎందుకు చేస్తున్నారు, ఏమి ఆశించి ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అంటే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ బాటలో సజ్జల నడుస్తున్నారని అంటున్నారు.