రాజధాని వద్దని విశాఖ ప్రజలతోనే చెప్పించాలని చూస్తున్నారు

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా రాజధాని అంశంపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

రాజధాని విషయంలో చంద్రబాబు విశాఖ ప్రజలను ఒత్తిడికి గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి రైతుల సెంటిమెంట్ ను విశాఖ ప్రజలపై రుద్ది, తమకు రాజధాని వద్దని విశాఖ ప్రజలతోనే చెప్పించాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

విశాఖ ప్రజలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దనాలని, కర్నూలు వాళ్లు హైకోర్టు వద్దనాలని, అమరావతి ఉంటేనే వికేంద్రీకరణ జరుగుతుందని రాష్ట్రంలో ఐదు కోట్ల మంది అనాలని చంద్రబాబు కోరుకుంటున్నారని అన్నారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడంలేదని, కనీసం టీడీపీ నాయకులకైనా అర్థమవుతుందా? అని సజ్జల ఎద్దేవా చేశారు.