రూపాయి! రూపాయి! ఎందుకు పడిపోతున్నావ్?

 

 

......రమ

 

 

అప్పుడెప్పుడో అప్పటి అమెరికా ప్రెసిడెంటు భారతీయులు తెగ తినేస్తున్నారు... అందుకే ఆహార కొరత ఏర్పడి౦ది అంటే మనం గింజుకున్నాం... అంత మాటంటాడా అని అ పెద్దమనిషి మీద కారాలు, మిరియాలు నూరాం. కాని కొన్ని నిజాలు తెలుసుకుంటే నిజమే సుమీ! మనకి కాస్త తిండియావ ఎక్కువే... అనుకున్నాం కాని మరీ ఇంత అనుకోలేదు అని మన ముక్కులమీదే కాదు ఎదుటివాడి ముక్కుమీద కూడా వేలు వేసి మరీ ఆశ్చర్యపోతాం...


వివరంగా చెప్పాలంటే రోజుకో ఆపిల్‌ తింటే ఆరోగ్యానికి మంచిదన్నారు కదా అని ఏకంగా పదకొండు వందల ఏభైరెండు కోట్ల రూపాయల ఆపిల్స్‌ని తినిపడేసారు... మంచిదేగా అంటారా? ఆ డబ్బు చేరింది మన దేశ రైతులకి కాదు విదేశీయులకి, డాలర్స్‌గా మారి చేరిపోయింది. మన సిమ్లా ఆపిల్స్‌.. పనికిరావని.. విదేశాల నుంచి గుట్టలుగుట్టలు అపిల్స్‌ని దిగుమతి చేసుకుని తిని పడేసారు... ఇండియాలో పండిన పండు తింటే స్టేటస్‌కి సరిపడదనేమో అమెరికా ఆపిల్సు, ఆస్ట్రేలియా అరంజస్‌.. వీటితో పాటు ఓ పక్క గిట్టుబాటుధర రాక మన రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే జీడిపప్పు లాంటివి కూడా దిగుమతి చేసేస్తున్నారు.. అక్షరాల 5వేల కోట్లకిపైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేసిమరీ... ఇలా మన ‘పెద్దల’ ప్రభుత్వం... ఆ పెద్దలకి విదేశీపళ్ళన్ని బంగారు పళ్ళెంలో పెట్టి మరీ అందిస్తూ... సామాన్యుడి నోటికి నాలుగు ముద్దలు కూడా చేరకుండా చేస్తోంది.



ఆ పెద్దల తిండియావ ఎంతంటే 40 రూపాయల డాలర్‌ 65కి చేరిపోయేంత..    ఇవి చాలవన్నట్టు.. ఎవరికైనా మందుతో కొనటమెలాగో తెలిసిన మన ప్రభుత్వం విదేశీ ముద్యంకోసం 1150 కోట్లకి పైగా ఖర్చు చేసింది. ఖరీదైన తాగుబోతుల సౌకర్యార్దం ప్రభుత్వం అందిస్తున్న ఈ సదావకాశాన్ని పూర్తిగా సద్వినియోగ పరుచుకుంటూ కడుపునిండా తాగెస్తున్నారు బడాబాబులు.



ఇలాంటి తిండి, తాగుడు... బడాబాబుల స్టేటస్‌కి తగ్గట్టు అందించటానికి సామాన్యుడిని బలి చేస్తోంది ప్రభుత్వం. ఇవన్నీ ఒక ఎత్తైతే కళ్ళద్దాలు, టీవిలు, వాచీలు, కారులు, ఫోన్లు... ఇలా ఒకటా రెండా ‘ఫారిన్‌’ పేరుని గొప్పలు చెప్పుకోటానికి లక్షల కోట్లు... బయటకి పంపిచెస్తూ సామాన్యుడిని ధరల కొరడాతో బాదెస్తోంది.



బలిసిన వారి ఆకలి బక్కచిక్కిన వారి కడుపు కోడుతోంది. కొందరి విదేశీమోజు కోట్ల భారతీయులని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిస్తోంది. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు..రూపాయి విలువ పడిపోవటానికి ఈ దిగుమతులూ ఓ కారణం.  మన వల్ల కానట్టు మనకి చేత కాదన్నట్టు దిగుమతులకి అనుమతులు ఇచ్చేసి చేతులు దులుపుకుని.. హాయిగా సామాన్యుడి కష్టాలని... చూస్తూ ఆనందిస్తున్న మన ప్రభుత్వం...సంక్షేమ ప్రభుత్వమెలా అవుతుంది? పేదవాడి ప్రభుత్వమని ఎలా అంటారు...మన రైతుని బలవంతంగా చంపెస్తున్నారు... మన చిరువ్యాపారి ఊపిరి తీసెస్తున్నారు. మన పరిశ్రమలని మూసెస్తున్నారు. కేవలం బడాబాబుల సంక్షేమ ప్రభుత్వ మిది..

  
జయహో కాంగ్రెస్‌
జయహో మన్మోహన్‌
జయహో చిదంబరం