TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆర్ఎస్ఎస్ చీఫ్‌కి... అంత భారీ భద్రతా?

Published on: Wed Apr 22, 2026 7:46PM

 

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్‌కు కల్పించిన జడ్‌ ప్లస్ కేటగిరీ భద్రతను సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో నాగపూర్‌కి  చెందిన సామాజిక కార్యకర్త లాలన్ కిషోర్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన వాదనల ప్రకారం.. ఆర్‌ఎస్‌ఎస్ అనేది ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా  రిజిస్టర్డ్ సంస్థ కాదని, అటువంటప్పుడు చట్టబద్ధత లేని ఒక సంస్థ ప్రతినిధి కోసం పన్ను చెల్లింపుదారుల సొమ్మును ధారపోయడం పూర్తిగా చట్టవిరుద్ధమన్నది పిటిషనర్ వాదన. 

జడ్‌ ప్లస్  భద్రత కోసం రోజుకు సగటున రూ.1.5 లక్షల వరకు, అంటే నెలకు సుమారు రూ.45 లక్షల ప్రజా ధనం ఖర్చవుతుండటంతో, ఈ వృథా ఖర్చును ఆయన నుంచే వసూలు చేయాలని డిమాండ్ చేశారు పిటిషనర్. 2015 కంటే ముందు కేవలం ఇద్దరు లేదా ముగ్గురు  ఉండే వైఫ్లస్ భద్రతలో ఉన్న భాగవత్‌కు, ఒక్కసారిగా ఈ స్థాయి బందోబస్తు పెంచడం వెనుక అసలు ముప్పు కంటే కూడా రాజకీయ పలుకుబడిని, సామాజిక హోదాను చాటుకునే ప్రయత్నమే కనిపిస్తోందని అంటారు పిటిషనర్. దేశంలో భద్రతా వ్యవస్థ అనేది ప్రాణహాని కంటే కూడా ఒక స్టేటస్ సింబల్ గా మారిందని, ఒక ప్రైవేట్ వ్యక్తి కోసం కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తన వాదనలో పేర్కొన్నారు. అయితే, ఈ లోతైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే కనీసం విచారణకు అనుమతి ఇవ్వకుండా హైకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ భద్రతా విషయంలో అసలు వాస్తవాలేంటో చూస్తే.. 

సాధారణంగా ఒక వ్యక్తికి భద్రత కల్పించేటప్పుడు ప్రభుత్వం కొన్ని ప్రామాణికాలను అనుసరిస్తుంది. నిఘా వర్గాల  నివేదికల ఆధారంగా ఒక వ్యక్తికి ప్రాణహాని ఎంత ఉందనేది కేంద్ర హోం శాఖ నిర్ణయిస్తుంది. వ్యక్తి హోదా కంటే అతనికి ఉన్న ముప్పు తీవ్రతనే ఇక్కడ ప్రామాణికంగా తీసుకుంటారు.  గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. ముప్పు ఉన్నప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ఉదాహరణకు పారిశ్రామికవేత్తలు లేదా ఆధ్యాత్మిక గురువులు వంటి వారికి భద్రత కల్పించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే, కొన్నిసార్లు ఆ ఖర్చును సదరు వ్యక్తులే భరించాలని కోర్టులు ఆదేశించిన దాఖలాలు కూడా ఉన్నాయి.

బాంబే హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించడానికి ప్రధాన కారణం—భద్రత అనేది కార్యనిర్వాహక వ్యవస్థ తీసుకునే నిర్ణయం అని భావించడం కావచ్చు. నిఘా నివేదికలు గోప్యంగా ఉంటాయి కాబట్టి, వాటిని బహిరంగ పరచడం సాధ్యం కాదు.  పిటిషనర్ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, అత్యున్నత న్యాయస్థానం ఈ క్రింది అంశాలను పరిశీలించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఒక రిజిస్టర్ కాని సంస్థ ప్రతినిధికి ప్రభుత్వ ఖర్చుతో భద్రత కల్పించడం చట్టబద్ధమేనా? భద్రతా కేటాయింపుల్లో పారదర్శకత ఎంతవరకు ఉండాలి? ప్రాణహాని వర్సెస్ ప్రజా ధనం మధ్య సమతుల్యతను ఎలా పాటించాలి? అన్న చర్చ చేసేలా తెలుస్తోంది. చట్టపరంగా చూస్తే, ప్రభుత్వం ఒక వ్యక్తి ప్రాణ రక్షణ తన బాధ్యత అని భావిస్తే అది ఆ వ్యక్తి సామాజిక హోదాతో సంబంధం లేకుండా భద్రత కల్పించవచ్చు. అయితే, ఆ నిర్ణయం రాజకీయ ప్రేరేపితమా లేక వాస్తవ ముప్పు ఆధారితమా? అనేది కోర్టు విచారణలో తేలాల్సి ఉంది.