రోజాకు ఎన్నాళ్లో వేచిన ఉదయం.. పెద్దిరెడ్డికి జబర్దస్త్ దెబ్బేనా?
Published on: Mon Apr 11, 2022 12:39PM

రోజాకి ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఇవాళే ఆవిష్కృతం. అంత ఈజీగా రాలేదు మంత్రి పదవి. అలిగి, పోరాడి, పట్టుబట్టి, దేవుళ్లకు మొక్కి.. జగనన్నను నమ్ముకొని.. మంత్రి పదవి సాధించారు. అందుకే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ఆమె ముఖంలో అంత సంతోషం. అంతులేని ఆనందం.
దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు రోజా. కాకపోతే, ఇన్నేళ్లూ ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం అయ్యేది. అందుకే, ఆమెను ఐరన్ లెగ్ అని కూడా అన్నారు. కానీ, 2019లో తను గెలిచి, జగన్ సీఎం కావడంతో ఆమె దశ తిరిగిపోతుందని అనుకున్నారంతా. తొలి కేబినెట్లోనే బెర్త్ కన్ఫామ్ అనుకున్నారు. కానీ, జగనన్న కనికరించలే. చెల్లి కొన్నాళ్లు అలిగింది. ఓ నామినేటెడ్ పోస్ట్ పడేసి కాస్త కూల్ చేశారు. అయినా, అసంతృప్తితో ఉన్నారు. ఇన్నాళ్లకి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రోజమ్మకు రోజా పువ్వు లాంటి పదవి వరించింది. మంత్రి కావాలనే ఆమె చిరకాల స్వప్నం నెరవేరింది.
రోజాకు మంత్రి పదవిపై చివరి నిమిషం వరకూ ఉత్కంఠ కొనసాగింది. ఆమెకు పదవి రాకుండా పెద్దిరెడ్డి మాగ్జిమమ్ ట్రై చేశారు. అప్పటికే చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి, నారాయణస్వామిల పేర్లు కన్ఫామ్ అయ్యాయి. ఒకే జిల్లా నుంచి ముగ్గురికి మినిస్టర్ పోస్టులంటే మామూలు విషయం కాదు. అందులోనూ, పెద్దిరెడ్డి లాంటి కీలక నేతే అడ్డుచెబుతుండటం, ఆయన మాట కాదనడం.. జగన్కు సాహసమే. అయినా, రోజా కోసం జగన్రెడ్డి సాహసమే చేశారంటున్నారు. పెద్దిరెడ్డిని కాదని, కులాలు-జిల్లాల సమీకరణాలను తోసిరాజని.. రోజాను కేబినెట్లోకి తీసుకున్నారు జగనన్న. అన్నేళ్ల ఆమె ఎదురుచూపులకు తెర దించారు.
ఇప్పటికే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి వర్సెస్ రోజా, నారాయణస్వామి వర్సెస్ రోజా.. ఎపిసోడ్ హాట్ హాట్గా సాగుతోంది. జస్ట్ ఎమ్మెల్యేగా ఉంటూనే ఆ ఇద్దరు మంత్రులను కాపు కాచుకుంటూ వచ్చారు. తనకు వ్యతిరేకంగా నగరిలో రెబెల్స్ను ప్రోత్సహించినా.. తనకు అడుగడుగునా అడ్డంకులు కల్పించినా.. కన్నీళ్లు పెట్టుకున్నారే కానీ, ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు రోజా. జగనన్ననే నమ్ముకున్నారు. తనకు ఏనాటికైనా న్యాయం చేస్తారని నమ్మకంగా ఉన్నారు. ఆమె తలచినట్టే.. ఒకే జిల్లా నుంచి మూడో మంత్రి పదవి ఇస్తూ.. రోజాను మంత్రి పదవి చేశారు జగన్రెడ్డి. ఇక, చిత్తూరులో ముగ్గురు మంత్రుల కుమ్ములాటలు మరింత పెరగొచ్చు.
ఇన్నాళ్లూ కేవలం ఎమ్మెల్యే మాత్రమే కావడంతో.. సండే సండే హైదరాబాద్ వచ్చేసి జబర్దస్త్ షోలు చేసుకునేవారు రోజా. ఇప్పుడిక మంత్రి కావడంతో మరింత బిజీగా మారుతారు. అందుకే ఇక ఆమె జబర్ధస్త్ నవ్వులు మిస్ అయినట్టే. ఆ కామెడీ షో.. కళ తప్పినట్టే.. అంటున్నారు. అదే టైమ్లో ఏపీలో ఇక రోజా పొలిటికల్ షో స్టార్ట్ అవడం ఖాయం.


