TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హిట్ మ్యాన్ రికార్డుల మోత

Published on: Mon Mar 30, 2026 8:48AM

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఈ సీజన్ లో తన తొలి మ్యాచ్ లోనే ఘన విజయం సాధించింది. ఐపీఎల్ లో ఆడిన తొలి మ్యాచ్ లో విజయం సాధించడం ముంబై ఇండియన్స్ కు ఇదే తొలిసారి. కోల్ కతా నైట్ రైడర్స్ లో  ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో  సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయ‌ర్‌ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.  ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో తన 50వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో కేవలం 39 బంతుల్లోనే 78 పరుగులు చేసి, ఒకే మ్యాచ్‌లో రెండు  రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

కోల్‌కతా నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. తన అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలో 50 లేదా అంతకంటే ఎక్కువ సార్లు యాభైకి పైగా స్కోర్లు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (72), డేవిడ్ వార్నర్ (66), శిఖర్ ధావన్ (53) మాత్రమే రోహిత్ కంటే ముందున్నారు.   

అది పక్కన పెడితే ఈ మ్యాచ్ లో తన ఇన్నింగ్స్ తో హిట్ మ్యాన్ మరో అరుదైన రికార్డు కూడా సాధించాడు. అదేంటంటే..  ఐపీఎల్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతాపై ఇప్పటివరకు 1161 పరుగులు చేసిన రోహిత్, పంజాబ్ కింగ్స్‌పై విరాట్ కోహ్లీ చేసిన 1159 పరుగుల రికార్డును అధిగమించాడు.  

ఈ మ్యాచ్‌లో మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్‌తో కలిసి రోహిత్  తొలి వికెట్‌కు 148 పరుగులు జోడించారు. కోల్‌కతాపై ముంబై ఇండియన్స్‌కు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.