ప్రియాంక జాగ్రత్త..రాబర్ట్ వాద్రా పోస్టు
posted on Feb 11, 2019 4:49PM
ప్రియాంక గాంధీ ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తూర్పు యూపీ ప్రచార బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ హోదాలో మొదటిసారి లక్నోలో రోడ్ షో నిర్వహించారు. తొలి పర్యటనలో ప్రియాంక వెంట ఆమె సోదరుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా అభినందనలు తెలుపుతూ సోషల్మీడియా వేదికగా ఉద్విగ్నభరిత పోస్టు చేశారు. ‘ఈ విష రాజకీయ వాతావరణంలో నా భార్యను జాగ్రత్తగా చూసుకోండి’ అని ప్రజలను కోరారు. ‘ప్రజలకు సేవ చేసేందుకు నువ్వు ప్రారంభించిన ఈ సరికొత్త ప్రయాణంలో నీకు అంతా మంచే జరగాలి. నువ్వు నాకు మంచి స్నేహితురాలివి. పరిపూర్ణమైన భార్యవి. నా పిల్లలకు గొప్ప తల్లివి. నేడు దేశంలో ప్రతీకార, విషపూరిత రాజకీయ వాతావరణం ఉంది. కానీ ప్రజలకు సేవ చేయడం ఆమె బాధ్యత అని నాకు తెలుసు. అందుకే ఆమెను ఈ దేశ ప్రజలకు అప్పగిస్తున్నాం. జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్’ అని రాబర్ట్ వాద్రా పోస్టు చేశారు. ప్రియాంక గాంధీకి రోడ్ షోలు, ప్రచార సభల్లో పాల్గొనటం కొత్తమీ కాదు. గతంలో ఆమె గాంధీ ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథి, రాయబరేలిలో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు.