TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

థాయ్‌లాండ్‌ సాంగ్‌క్రాన్ ఉత్సవాల్లో విషాదం.. 191 మంది మృతి

Published on: Fri Apr 17, 2026 10:25AM

థాయ్‌లాండ్‌లో అత్యంత వైభవంగా జరిగే సాంగ్‌క్రాన్ ఉత్సవాలు ఈ ఏడాది తీవ్ర విషాదాన్ని నింపాయి. ప్రపంచంలోనే అతిపెద్ద 'నీటియుద్ధంగా గుర్తింపు పొందిన   ఈ వేడుకల ప్రారంభంలోనే భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. కేవలం మొదటి మూడు రోజుల్లోనే వివిధ రోడ్డు ప్రమాదాల్లో  191 మంది మరణించారు. ఏటా ఏప్రిల్ నెల మధ్యలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే సాంగ్ క్రాన్ ఉత్సవం భారీ ప్రాణనష్టంతో విషాదంగా మారింది.  

థాయ్ లాండ్  నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నీళ్లతో ఒకరినొకరు తడుపుకుంటూ పండుగ చేసుకుంటారు. కానీ ఈ ఏడాది ఈ ఉత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాలలో 191 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. సాంగ్ క్రాన్ ఉత్సవాల ప్రారంభం రోజునే రోడ్డు ప్రమాదాలలో 51 మంది మరణించారు.  

మితిమీరిన వేగం కారణంగానే ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలుపుతున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, అదీ మద్యం సేవించి వాహనాలు నడపడం, అలాగే శిరస్త్రాణాలు ధరించకపోవడం కారణంగా ప్రమాదాలలో మృతుల సంఖ్య భారీగా పెరిగిిందని అధికారులు చెబుతున్నారు.  

కాగా ఈ సాంగ్ క్రాన్ వేడుకల సందర్భంగా రోడ్డు ప్రమాదాలు జరగడం అన్నది ఏటా సర్వసాధారణమే అయినా, ఈ ఏడాది ప్రమాదాల సంఖ్యా, మృతుల సంఖ్యా కూడా ఆందోళనకర స్థాయికి పెరిగిందంటున్నారు. ఏప్రిల్ నెల మధ్యలో ఆరంభమై వారం రోజుల పాటు జరిగే సాంగ్ క్రాన్ పండుగ కాలాన్ని అధికారులు సెవెన్ డేంజరస్ డేస్ గా చెబుతుంటారు.  ఈ పండుగ రోజులలో  బ్యాంకాక్ వంటి  నగరాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు తరలివెడతారు. ఆ కారణంగా రోడ్లన్నీ కక్కిరిసిపోతాయి.  ఆ కారణంగా కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.