TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై... మహారాష్ట్ర సీఎంకు రేవంత్‌ లేఖ

Published on: Wed May 27, 2026 8:38PM

 

తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది.  ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయమివ్వాలని,  అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. 

డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్‌ నిర్మించాల్సి ఉంది.  మొదటి ప్రతిపాదనలో ఈ బ్యారేజ్‌ 152 మీటర్ల ఎత్తు నిర్మించాలనుకున్నారు. 2016 ఆగస్టు 23న జరిగిన ఇంటర్‌ స్టేట్‌ బోర్డు సమావేశంలో తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తున బ్యారేజ్‌ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.  అవసరమైన అనుమతులకు  సహకారం అందిస్తామని కూడా మహారాష్ట్ర అప్పట్లో తెలిపింది.

ఇటీవల ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని పున: సమీక్షించింది.  148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌ ఉత్తర తెలంగాణ నీటి  అవసరాలకు సరిపోదని నిపుణుల సూచనలతో అంచనాకు వచ్చింది.  అందుకే ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో సాగునీరు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై మరోసారి చర్చ అవసరమని సీఎం రేవంత్‌ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు.  148 మీటర్ల కంటే కొంత ఎక్కువ ఎఫ్‌ఆర్‌ఎల్‌  పరిశీలించినా,  మహారాష్ట్రలో  ముంపు ప్రభావం తక్కువగానే ఉంటుందని  సీఎం వివరించారు.  ఎఫ్‌ఆర్‌ఎల్‌ పెరిగితే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీటిని తెచ్చుకునే వీలుందని ప్రస్తావించారు.