ఆ శాపమే హరీష్ ని బలి చేసింది !

 

తెలంగాణా మాజీమంత్రి హరీశ్ రావుపై మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ శాపం తగిలింది కాబట్టే హరీశ్ రావు సిద్ధిపేటకు పరిమితమయ్యారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజానికి గత ఎన్నికల సమయంలో కోడంగల్, కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ ల విషయంలో ఆ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీష్ రావు రెండు చోట్లా టీఆర్ఎస్ అభ్యర్ధులని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన్ని పార్టీ పక్కన పెట్టింది. ఇప్పుడు అదే విషయాన్ని ఉద్దేశిస్తూ ఆయన మీద రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పొట్టొని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడి నెత్తిని పోచమ్మ కొట్టినట్టుగా హరీశ్ రావు పరిస్థితి తయారైందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల తరువాత హరీశ్ రావు పరిస్థితి ఇలా కావడానికి కారణం కొడంగల్ ప్రజల శాపమేనని ఆయన పేర్కొన్నారు. కొడంగల్‌ తో పెట్టుకున్నవాడేవడూ బాగుపడలేదని అన్నారు. కొడంగల్‌ లో తనను ఓడిస్తే కొడంగల్ బిడ్డలు మల్కాజ్ గిరి వచ్చి ప్రచారం చేసి మరీ ఢిల్లీకి పంపించారని రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచిన అనంతరం తొలిసారి కొడంగల్‌ వచ్చి కోస్గిలో నిర్వహించిన సన్మాన సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా  పనిచేయాలని శ్రేణులకు సూచించారు.