ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే రాజీనామా.. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
Published on: Tue Apr 7, 2026 10:15AM
.webp)
కడప జిల్లా జమ్మలమడుగులో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మోడీ సహకారంతో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీస్తున్నదన్నారు. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరుగుతున్నదంటూనే.. జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులు చేసి బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తకు ఉందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి 21 నెలలు గడుస్తున్నా నియోజకవర్గములో కొన్ని సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయని ఆదినారాయణరెడ్డి అన్నారు. గండికోట ముంపు వాసులకు పరిహారం చెల్లింపు, రాజోలి జలాశయ నిర్మాణం, ఎస్ ఆర్ బి సి నిర్మాణం, ఆర్టిపిపి సమస్య పరిష్కారం కావాల్సి ఉందన్నారు.
గండికోట జలాశయంలో ఇప్పటికే నీరు నిలువ చేస్తూ నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడం దారుణమన్న ఆయన.. ఈ సమస్యల పరిష్కారం కాకుంటే.. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి ప్రజల వెంటే ఉంటా తప్ప అధికారం కోసం ఆరాటపడనని సంచలన వ్యాఖ్యలు చేశారు.


