చంద్రగిరిలో మరో 2 చోట్ల రీపోలింగ్‌.. ఈసీ గ్రీన్ సిగ్నల్

 

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మరో రెండు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరగనుంది. రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు, కాలేపల్లిలోని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ రెండింటితో సహా మొత్తం 7 కేంద్రాల్లో ఆదివారం పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న చెప్పారు. 7 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు ప్రద్యుమ్న పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నట్లుగా ఎన్నికల ఫుటేజీ ఎక్కడా లీక్ కాలేదని, ఈసీకి మాత్రమే ఫుటేజీని పంపించామని కలెక్టర్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. టీడీపీ ఫిర్యాదు మేరకు రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు, కాలేపల్లిలోని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ప్రజలందరూ నిర్భయంగా ఓటు వేయాలని ప్రద్యుమ్న పిలుపునిచ్చారు.