TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఈసీని తొలగించండి.. రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు విపక్షాల నోటీసు

Published on: Sat Apr 25, 2026 5:01PM

కేంద్ర ఎన్నికల సంఘం  ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ణానేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ   ప్రతిపక్ష పార్టీలు తమ గళాన్ని పెంచాయి.  ఈ మేరకు వివిధ పార్టీలకు చెందిన సుమారు 73 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసిన  నోటీసును రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు అందజేశారు. భారత ఎన్నికల సంఘం పనితీరుపై గత కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు, ఇప్పుడు నేరుగా సీఈసీని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగడం రాజకీయ వర్గాల్లో   సంచలనంగా మారింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని తొలగించాలనే ప్రతిపాదనతో కూడిన ఈ పరిణామం హాట్ టాపిక్ గా మారింది. 

ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి.   ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియకు వెన్నెముకగా నిలిచే ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని విపక్ష నేతలు పేర్కొన్నారు. గతంలో కూడా కొన్ని అంశాలపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఈసారి ఏకంగా 73 మంది సభ్యులు ఒకే తాటిపైకి వచ్చి అధికారికంగా నోటీసు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి,  ఎన్నికల కమిషన్‌కు ఒక సవాలుగా మారిందనడంలో సందేహం లేదు.

నోటీసులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఎన్నికల సమయంలో నిబంధనల అమలులో వివక్ష, అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు వంటి ఆరోపణలు ఉన్నాయి.  కీలకమైన అంశాలపై ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం, ఓటర్ల జాబితాలో మార్పులు-చేర్పులు వంటి సున్నితమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి అంశాలను సభ్యులు తమ నోటీసులు సభ్యులు పేర్కొన్నారు.  

రాజ్యసభ నిబంధనల ప్రకారం..  రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటే తగిన సంఖ్యలో సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుత నోటీసుపై 73 మంది సభ్యులు సంతకాలు చేయడంతో..  దీనిపై సభలో చర్చ జరగాలనే డిమాండ్ మరింత గట్టిగా వినిపించే అవకాశం ఉంది. చైర్మన్ ఈ నోటీసును పరిశీలించి, అది నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో  నిర్ధారించుకునన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటారు. సపోజ్ ఫర్ సపోజ్ ఈ నోటీసు ఆమోదం పొందితే, సభలో దీనిపై  చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.

గత కొద్ది కాలంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న సాంకేతికత మరియు ఎన్నికల కోడ్ అమలు తీరుపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో రాజ్యాంగ సంస్థలు విఫలమవుతున్నాయని విపక్షాలు పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఈసీని లక్ష్యంగా చేసుకుని విపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసు ప్రాధాన్యత సంతరించుకుంది.