TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులకు హైకోర్టులో ఊరట

Published on: Fri Apr 24, 2026 6:28PM

 

తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనంగా నిలిచిన మిలియన్ మార్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మంత్రి కే తారక రామారావు, మాజీ మంత్రి టి హరీశ్ రావులకు పెద్ద ఊరట లభించింది.  2011లో నమోదైన కేసులను హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ కొట్టివేసింది. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా 2011 మార్చిలో హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్‌పై భారీగా “మిలియన్ మార్చ్” నిర్వహించబడింది. రాష్ట్ర విభజనకు మద్దతుగా నిర్వ హించిన ఈ కార్యక్రమానికి వేలాదిమంది ఉద్యమకారులు హాజరయ్యారు. ఆ రోజు నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో కొందరు ఆందోళనకారులు మీడియా సంస్థల కెమెరాలు, ఓబీ వ్యాన్లు ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. 

దీనిపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆ సమయంలో ఉద్యమానికి నేతృత్వం వహించిన పలు వురు ప్రముఖ నాయకులను కూడా కేసులో నిందితులుగా చేర్చారు.దర్యాప్తు సమయంలో కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల పేర్లు చేర్చడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ కేసులపై ముగ్గురు నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తమకు ప్రత్యక్ష సంబంధం లేదని వారి తరఫు న్యాయవాది రమణారావు కోర్టులో వాదనలు వినిపించారు.

పిటీషనర్ల వాదనలు, కేసు వివరాలు పరిశీలించిన హైకోర్టు, ముగ్గురు నేతలపై నమోదు చేసిన కేసులకు తగిన ఆధారాలు లేవని అభిప్రాయపడింది. కేసుతో పిటీషనర్లకు ప్రత్యక్ష సంబంధం నిరూపించలేక పోయారని పేర్కొంటూ, హైకోర్టు కేసులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు దశాబ్దానికి పైగా కొనసా గుతున్న ఈ కేసులకు ముగింపు పలకడంతో, తెలంగాణ ఉద్యమ కాలానికి సంబంధించిన ఒక కీలక అధ్యాయం ముగిసినట్లైంది. ముగ్గురు నేతలకు కోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద ఊరటను ఇచ్చింది.