ఇంకా చల్లారని విస్తరణ మంటలు... మరో గులాబీ ఎమ్మెల్యే అసంతృప్తి

 

మంత్రివర్గ విస్తరణ తర్వాత టీఆర్ఎస్ లో చెలరేగిన సెగలు ఇంకా చల్లారడం లేదు. ఒకరి తర్వాత మరొకరు తమ అసంతృప్తిని బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తన అసహనాన్ని వెళ్లగగ్గారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తాను సీనియర్ నాయకుడినని, అలాంటి తనకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తన కంటే జూనియరైన ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కు మంత్రి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం చెప్పారు. అయితే, రెడ్యానాయక్ అసంతృప్తి గురించి తెలుసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.... ఆయనను బుజ్జగించారు. తన ఛాంబర్ కు పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. దాంతో కేటీఆర్ ముందే రెడ్యానాయక్ తన అసంతృప్తిని బయటపెట్టారు. సీనియరైన తనకు కాకుండా.... సత్యవతి రాథోడ్ కు మంత్రి పదవి ఇవ్వడంపై అసహనం వ్యక్తంచేశారు. దాంతో రెడ్యానాయక్ ను బుజ్జగించిన కేటీఆర్... త్వరలోనే ప్రాధాన్యత దక్కుతుందంటూ భరోసా ఇచ్చారు.