గీత దాటితే వేటే.. అసెంబ్లీలో కొత్త రూల్...
Published on: Tue Mar 15, 2022 1:17PM
తెలుపు-ఆకుపచ్చ-ఎరుపు. వరుసగా మూడు గీతలు. ఇందులో ఎర్ర గీత దాటితే.. ఇక అంతే. రెడ్ లైన్ దాటొచ్చిన సభ్యుడు ఏపీ అసెంబ్లీ నుంచి ఆటోమెటిక్గా సస్పెండ్ అయిపోతారు. ఇదీ కొత్త రూల్. టీడీపీని గీతలోనే కట్టడి చేసేలా.. స్పీకర్ పోడియం వైపు దూసుకురాకుండా తీసుకొచ్చిన కొత్త నిబంధన.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్త రూల్ వచ్చేసింది. స్పీకర్ పోడియం వద్ద ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలను కట్టడి చేసేందుకు స్పీకర్ తమ్మినేని సీతారం సరికొత్త రూల్ను అమల్లోకి తెచ్చారు. ఇకపై పోడియం వద్దకు దూసుకువస్తే ఆటో మేటిక్గా సస్పెండ్ అయ్యే రూలింగ్ను తీసుకువస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. పోడియం ముందు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు లైన్ను ఏర్పాటు చేశారు. ఎవరైనా సభ్యులు ఎరుపు లైన్ను దాటితే ఆటోమేటిక్గా సస్పెండ్ అయ్యేలా రూలింగ్ తీసుకొచ్చారు. సస్పెండ్ అయిన సభ్యుడిని హౌజ్ నుంచి బయటకు పంపడానికి ఇకపై సభ అనుమతి అవసరం కూడా లేదు.
ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. జంగారెడ్డిగూడెం ఘటనకు సంబంధించి అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టి.. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారు. టీడీపీ నిరసనతో ప్రభుత్వం బాగా ఇరకాటంలో పడింది. ఇలా పదే పదే ప్రతిపక్ష సభ్యులు ప్రజా సమస్యలపై సభలో నిరసన తెలుపుతుండటంతో.. వారికి కట్టడి చేసేలా ఈ రెడ్ లైన్ రూల్ తీసుకొచ్చారనే వాదన వినిపిస్తోంది. ఏది ఏదైనా సభలో స్పీకర్దే ఫైనల్ డెసిషన్. రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్.


