కరోనా వ్యాప్తి తీవ్రం.. ఒక్క రోజే 3 లక్షలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రికవరీలు పెరుగుతున్నా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. అయితే వైరస్ బలహీనపడిందని కొంతమంది శాస్త్రవేత్తలు చెపుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మాత్రం మరింత తీవ్రమవుతోంది. నిన్న ఒక్క రోజే 3,13,629 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచం మొత్తం కరోనా కేసుల సంఖ్య 3కోట్ల 27లక్షల 42వేల 591కి చేరింది. నిన్న ఒక్క రోజే 5700 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 9,92,835కి చేరింది. అయితే కొంత ఊరటనిచ్చే అంశం ఏంటంటే రికవరీ కేసుల సంఖ్య 2కోట్ల 41లక్షలకు పైగా ఉంది. ఇకపోతే ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 75లక్షల 97వేలకు పైగా ఉన్నాయి. అమెరికాలో నిన్న కొత్తగా 50,617 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 72లక్షల 35వేలు దాటింది. అదే సమయంలో నిన్న 803 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 2లక్షల 8వేలు దాటింది. ఇక బ్రెజిల్‌లో నిన్న కొత్తగా 32670 కేసులొచ్చాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 46లక్షల 92వేలు దాటింది. అంతేకాకుండా కొత్తగా 826 మంది చనిపోవడంతో.. మొత్తం మరణాల సంఖ్య లక్షా 40వేలు మించి పోయింది.

 

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో మాత్రం ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. అదేవిధంగా మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత మన భారత్ మూడో స్థానంలో ఉంది. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే రోజువారీ నమోదవుతున్న కరోనా మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాటి స్థానాల్లో బ్రెజిల్, అమెరికా, మెక్సికో ఉన్నాయి. భారత్ లో కొత్తగా 86,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58,18,570కి చేరింది. కొత్తగా 1,141 మంది మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 92,290కి చేరింది. అయితే కొత్తగా 81,177 మంది కరోనాతో పోరాడి వైరస్ పై విజయం సాధించారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 47,56,164కి చేరింది. ప్రస్తుతం భారత్‌లో 9,70,116 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మనదేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 12,82,963 మందికి కరోనా సోకగా.. 34,345 మంది మృత్యువాత పడ్డారు. ఇక రెండో స్థానంలో ప్రస్తుతం ఏపీ ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్నాటక, యూపీ రాష్ట్రాలున్నాయి. ఇది ఇలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో వైరస్ వ్యాప్తి తగ్గినట్లే తగ్గి మళ్ళీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.