TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సజ్జల సైలెంట్!.. రీజన్ అదేనా?

Published on: Mon Apr 4, 2022 5:36PM

వైయస్ జగన్ ప్రభుత్వంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు లేదా జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్షం టీడీపీ విమర్శలు సంధించినప్పుడు.. నేనున్నా.. నేనున్నా అంటూ మీడియా ముందుకు వచ్చి..ప్రెస్ మీట్ పెట్టే ఏకైక వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ప్రభుత్వంలో పేరుకే సలహదారుడిగా ఉన్నా ఆయన.. ప్రభుత్వంలో ఏ శాఖ మంత్రి మాట్లాడకుండా.. వారి మాటలను కూడా ఆయనే జగన్ పలుకు.. జగనన్న పలుకు అన్నట్లు మాట్లాడేస్తారు. దీంతో ఆయనకు సకల శాఖల మంత్రి అనే ట్యాగ్‌ను ప్రతిపక్షం తగిలించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల సజ్జల వారు ప్రెస్‌మీట్‌లు పెడుతూ.. మీడియా ముందుకు వచ్చి సౌండ్ చేయడం లేదనే ఓ టాక్ అయితే అమరావతిలో తెగ హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో సజ్జల వారి సైలెంట్‌ వెనుక ఉన్న కారణాలపై భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. 

ఇటీవల సీఎం వైయస్ జగన్.. తన కేబినెట్‌ను వునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ క్రమంలో కేబినెట్‌లో ఒకరు ఇద్దరు తప్పా.. మిగిలిన వారంతా కొత్తవారు వస్తారనే ఓ టాక్ అయితే నడుస్తోంది. దీంతో కొత్త మంత్రుల బాధ్యతను సీఎం జగన్.. తన రాజకీయ వ్యవహారాల సలహాదారు.. శ్రీ శ్రీ శ్రీ సజ్జల వారి భుజస్కంధాలపై పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మంత్రులు అయిన వారు కాకుండా.. మిగతా ఎమ్మెల్యేల పనితీరు.. వారికి నియోజకవర్గంలో ప్రజల్లో ఉన్న గుడ్ విల్‌తోపాటు వారి ప్లస్‌లు.. మైనస్‌లపై నివేదికలు తెప్పించుకోవడంతో పాటు  క్యాస్ట్ ఈక్వేషన్స్‌ చూసి వాటి ఆధారంగా వారి ఎంపిక ప్రక్రియను ఈ సజ్జల వారు చేపట్టనున్నట్లు సమాచారం. 

అదీకాక రానున్నదీ ఎన్నికల సీజన్.. ఈ నేపథ్యంలో ప్రజలతో మమేకమయ్యే వారికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని.. సీఎం జగన్ నుంచి ఇప్పటికే సజ్జల వారికి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఆయన జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. జగన్ కొత్త కేబినెట్ కొలువు తీరే వరకే కాకుండా.. . మాజీలు అయిన పాత మంత్రులకు.. జిల్లాల వారిగా కొత్త బాధ్యతలు అప్పగించే వరకు ఈ సజ్జల వారు సైలెంట్‌గా ఉంటారనే ఓ టాక్ అయితే తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా మస్త్ మస్త్‌గా నడుస్తోంది. 

అలాగే రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. ఈ నాలుగు స్థానాలు.. వైయస్ఆర్సీపీ ఖాతాలోకే వెళ్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి ఎంపిక బాధ్యత కూడా సీఎం జగన్.. సజ్జల మీద పెట్టినట్లు తెలుస్తోంది. దానిపై ఇప్పటికే సజ్జల చాలా కసరత్తు చేసి.. నాలుగురి పేర్లు ఖరారు చేయగా.. అందులో ముగ్గురి పేర్లు.. జగన్ ఖరారు చేశారని సమాచారం. మరొకరి పేరుపై జగన్ సందిగ్ధనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఒక్కరిని కూడా ఏప్రిల్ నెలాఖరులోగా సీఎం జగన్ ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. 

మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు 2024 కంటే మందే ఉండే సూచనలు ఉన్నాయంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరీ అవసరమైతే తప్పా.. అప్పటి వరకు ఈ సజ్జల వారు సైలెంట్‌ని వీడేలా లేరని ఓ చర్చ అదే తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా వైరల్ అవుతోంది.